కరణం బలరాం తర్వాత సైకిల్ దిగిన మరో నేత..!

ABN , First Publish Date - 2020-03-13T18:26:55+05:30 IST

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ప్రతిపక్ష పార్టీ టీడీపీని దెబ్బతీయడమే లక్ష్యంగా వైసీపీ నిస్సిగ్గుగా...

కరణం బలరాం తర్వాత సైకిల్ దిగిన మరో నేత..!

కర్నూలు: స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ప్రతిపక్ష టీడీపీని దెబ్బతీయడమే లక్ష్యంగా వైసీపీ నిస్సిగ్గుగా ప్రలోభాలకు దిగుతోంది. జిల్లాలవారీగా టీడీపీ నేతలకు గాలం వేసే ప్రయత్నాలను వైసీపీ ముమ్మరం చేసింది. టీడీపీలోని నేతలను తమ వైపు తిప్పుకుంటే.. స్థానిక ఎన్నికల సమయంలో టీడీపీ కేడర్ చెల్లాచెదురవుతోందని.. తద్వారా పరిస్థితి తమకు అనుకూలంగా మారుతుందనేది అధికార పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. కడప జిల్లాలో రామసుబ్బారెడ్డి, ప్రకాశం జిల్లాలో కదిరి బాబూరావు, కరణం బలరాం ఇప్పటికే టీడీపీని వీడారు. తాజాగా కర్నూలు జిల్లాపై వైసీపీ దృష్టి పెట్టినట్టు తెలిసింది. అందులో భాగంగానే.. కర్నూలు జిల్లాలో టీడీపీకి అండగా ఉన్న కేఈ కుటుంబంలో వైసీపీ రాజకీయ చీలికలు తెచ్చింది.


కేఈ కృష్ణమూర్తి సోదరుడు.. టీడీపీ నేత, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. టీడీపీలో కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని.. అందుకే రాజీనామా చేస్తున్నట్లు కేఈ ప్రభాకర్ వ్యాఖ్యానించారు. వైసీపీ, బీజేపీ, జనసేన తనకు టచ్‌లో ఉన్నాయని రాజీనామా అనంతరం ప్రభాకర్ చెప్పుకొచ్చారు. అయితే.. ఆయన వైసీపీ వ్యూహంలో భాగంగానే రాజీనామా చేశారని.. త్వరలో జగన్ సమక్షంలో కండువా కప్పుకోవడం ఖాయమన్న ప్రచారం స్థానికంగా జరుగుతోంది.

Updated Date - 2020-03-13T18:26:55+05:30 IST