అధిష్ఠానం ఆదేశిస్తే పోటీ చేస్తా
ABN , First Publish Date - 2020-12-11T05:35:28+05:30 IST
తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, నంద్యాల టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.
- ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి
నంద్యాల, డిసెంబరు 10: తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, నంద్యాల టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. గురువారం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ తరపున పోటీ చేసే విషయం అధిష్ఠాన నిర్ణయంపైనే ఆధారపడి ఉందన్నారు. నంద్యాలలో తాను గతంలో తయారు చేసిన వర్గమే ఇప్పటికీ ఉందన్నారు. భూమా నాగిరెడ్డి, తాను వేర్వేరు కాదని, తమ మధ్య ఎప్పుడూ భిన్నాభిప్రాయాలు రాలేదని అన్నారు. ఏవీ గ్రూపు అన్నా.. భూమా గ్రూపు అన్నా ఒక్కటేనన్న అభిప్రాయం నాటి నుంచి నేటి వరకు ఉందన్నారు. భూమా బ్రహ్మానందరెడ్డికి నంద్యాల నాయకత్వం వారసత్వంగా వచ్చిందేతప్ప.. వర్గం, నాయకులు అంతా తన వారేనని ఏవీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇన్చార్జిగా భూమా బ్రహ్మానందరెడ్డి కొనసాగుతున్నారని, పార్టీ అవకాశం ఇస్తే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని అన్నారు. లేకపోయినా టీడీపీకి సానుభూతిపరుడిగా కొనసాగుతానని తెలిపారు.