పాయసంలో నిద్రమాత్రలు.. భర్త నిద్రమత్తులోకి జారుకోగానే..
ABN , First Publish Date - 2020-04-26T19:14:11+05:30 IST
వివాహేతన సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను..

ప్రమాదం కాదు.. హత్య
భర్తను చంపించిన మహిళ
ఛేదించిన త్రీటౌన్ పోలీసులు
కర్నూలు(ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించింది ఓ మహిళ. దీన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు చేసిన ప్రయత్నాలను పోలీసులు వమ్ము చేశారు. త్రీ టౌన్ సీఐ తబ్రేజ్ తెలిపిన వివరాల మేరకు, నగరంలోని గిప్సన్ కాలనీకి చెందిన రామనాయుడుకు 17 ఏళ్ల క్రితం నిర్మల అనే మహిళతో వివాహం అయింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రామానాయుడు మద్యానికి బానిసై, నిత్యం భార్యను వేధించేవాడు.
భర్త తాగుడు మానుకోకపోవడంతో కుటుంబ పోషణ కష్టమైంది. దీంతో నిర్మల రెండేళ్ల క్రితం ఎస్ఎల్ఎన్ కేవీ ఫుడ్ ఫ్యాక్టరీలో స్వీపర్గా చేరింది. అక్కడ కిషోర్బాబు అనే వ్యక్తితో పరిచయమై, వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న రామానాయుడు తరుచూ భార్యతో గొడవపడేవాడు. దీంతో తన భర్తను ఎలాగైనా చంపేయాలని కిషోర్ను కోరింది. రామానాయుడును హత్య చేసేందుకు తన అల్లుడు, ధర్మపేటకు చెందిన విజయ్, స్నేహితుడు రాకేష్ను కిషోర్ సంప్రదించాడు. అందరూ కలిసి హత్యకు పథకం వేశారు.
జనతా కర్ఫ్యూ రోజున..
మార్చి 22, జనత కర్ఫ్యూ రోజున రామానాయుడుకి నిర్మల పాయాసం ఇచ్చింది. అందులో నిద్రమాత్రలు కలిపింది. పాయసం తిన్న రామానాయుడు నిద్రమత్తులోకి జారుకున్నాడు. ఆ రాత్రి 11 గంటల సమయంలో విజయ్, రాకేష్, కిషోర్ ఆటోలో వీరి ఇంటికి వచ్చారు. నిద్రిస్తున్న రామానాయుడుని గొంతుపై కాలుపెట్టి చంపేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని తీసుకుని నంద్యాల రోడ్డులో ఉన్న దిన్నెదేవర పాడు వంతెన ఫీట్ రోడ్డుకు వద్దకు తీసుకువెళ్లి పడేశారు. ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహంపై ఆటోను ఎక్కించారు.
ఆ మరుసటి రోజు తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని నిర్మల పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ తబ్రేజ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదికతో ఘటనపై అనుమానాలు తలెత్తాయి. దీంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. నిర్మల ప్రవర్తన గురించి ఆరా తీశారు. దీనికితోడు సాంకేతిక పరిజా ్ఞనాన్ని ఉపయోగించారు. రామానాయుడు ప్రమాదంలో మృతిచెందలేదని, హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. రామానాయుడు భార్య నిర్మలను, ఆమెకు సహకరించిన నిందితులు కిషోర్, విజయ్, రాకేష్ను అరెస్టు చేశారు.