డోన్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
ABN , First Publish Date - 2020-12-27T04:56:39+05:30 IST
రాష్ట్రంలో డోన్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు.
![డోన్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా](https://media.andhrajyothy.com/appimg/galleries/2020122611234228/12262020232622n7.jpg)
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
బేతంచెర్ల, డిసెంబరు 26: రాష్ట్రంలో డోన్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. ఆర్ఎస్ రంగాపురం, బేతంచెర్ల పట్టణంలో రూ.53.60 కోట్లతో డబుల్ రోడ్ల నిర్మాణానికి ఎంపీ పోచా బ్రహ్మానందారెడ్డితో కలిసి ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. బేతంచెర్ల సంజీవ నగర్లో ఎంపీ నిధులు రూ.5 లక్షలతో మినరల్ వాటర్ ప్లాంటును ప్రారంభించారు. ఆర్ కొత్తపల్లె, ఆర్ఎస్ రంగాపురం గ్రామాల్లో 200 పట్టాలను నిరుపేదలకు పంపిణీ చేశారు. ఆర్ఎస్ రంగాపురం రైల్వేగేటు సమీపంలో, ఆర్ కొత్తపల్లె ఉన్నత పాఠశాల సమీపంలో ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ పోచా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డోన్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. రంగాపురం బహిరంగ సభలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ విద్య, వైద్యం, రవాణా, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. తమ్మరాజుపల్లె నుంచి బేతంచెర్ల డబుల్రోడ్డు నిర్మాణానికి రూ.25 కోట్లు, బేతంచెర్ల నుంచి రామళ్లకోట వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.42 కోట్లు, ఆర్ఎస్ రంగాపురం నుంచి మద్దిలేటిస్వామి దేవస్థానం వరకు డబుల్రోడ్డు నిర్మాణానికి రూ.9.60 కోట్లు, ఆర్ఎస్ రంగాపురం నుంచి తవిశికొండ వరకు రోడ్డు నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేయించానని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బాలికలకు డోన్లో హాస్టల్, పాఠశాల, జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్యాపిలి మండలంలో గొర్రెల పెంపకంపై శిక్షణ, వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల, బేతంచెర్లలో ప్రభుత్వ ఐటీఐ, బాలికలకు వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. బేతంచెర్ల శేషారెడ్డి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అప్గ్రేడ్ చేస్తూ 30 పడకల కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంగా, డోన్లో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేశామని తెలిపారు. బేతంచెర్ల, ప్యాపిలి, డోన్లో పేదలకు 1165 ఇంటి పట్టాలు, ఇళ్లు మంజూరు చేశామని అన్నారు. నియోజకవర్గంలో 67 జగనన్న కాలనీల ఏర్పాటుకు రూ.500 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. వచ్చే ఏడాది రూ.300 కోట్లతో వాటర్గ్రిడ్ పథకం కింద బేతంచెర్ల, ప్యాపిలి, డోన్ మండలాల ప్రజలకు తాగునీరు సరఫరా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జాయింట్ కలెక్టరు ఖాజామొహిద్దీన్, ఆర్డీవో వెంకటేశ్వర్లు, బేతంచెర్ల తహసీల్దారు విద్యాసాగర్, ప్రత్యేకాధికారి డాక్టర్ వెంకటరమణ, ఎంపీడీవో అశ్వినికుమార్, డ్వామా పీడీ అమర్నాథ్రెడ్డి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసులు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ జయరామిరెడ్డి, ఏఈ మునిస్వామి, పీఆర్ఏఈ గణేష్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ బాలకృష్ణ, వైసీపీ నాయకులు ముర్తుజావలి, ఖాజాహుస్సేన్, బుగ్గన నాగభూషణంరెడ్డి, చంద్రారెడ్డి, చలమ్రెడ్డి, నాగరాజు, మునీశ్వరరెడ్డి, రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.