హామీలు అమలు చేయాలి
ABN , First Publish Date - 2020-12-04T05:05:40+05:30 IST
జిందాల్ యాజమాన్యం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు గౌరు చరిత డిమాండ్ చేశారు.

- మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత
గడివేముల, డిసెంబరు 3: జిందాల్ యాజమాన్యం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు గౌరు చరిత డిమాండ్ చేశారు. గురువారం ఆమె విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఫ్యాక్టరీ నిర్మించక ముందు జిందాల్ యాజమాన్యం బిలకలగూడురు, బూజనూరు గ్రామాల్లో సమావేశం ఏర్పాటు చేసి గ్రామాల్లోని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఫ్యాక్టరీ ప్రారంభమై ఏళ్లు గడుస్తున్న హామీలు అమలు చేయడంలో యాజమాన్యం విఫలమైందని ఆరోపించారు. బూజనూరు గ్రామ సమీపంలో ఎస్సార్బీసీపై వంతెన ఏర్పాటు చేస్తామని, పశువుల మేత కోసం గ్రేజింగ్ ల్యాండ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. బిలకలగూడురు, బూజనూరు గ్రామాల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. కేసీ కెనాల్ చివరి ఆయకట్టుకు సాగునీరు అందించే వెలగమాను ఫీడర్ చానల్ జిందాల్ పరిశ్రమ వల్ల జాప్యం జరిగిందని అన్నారు. ఈ పరిశ్రమ నుంచి రైతు లు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. జిందాల్ యాజమాన్యం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలతో కలిసి పోరాడతామని ఆమె హెచ్చరించారు.