ఫేస్బుక్ ఫ్రెండ్షిప్తో మోసం
ABN , First Publish Date - 2020-05-31T10:20:18+05:30 IST
ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఓ మహిళ కర్నూలుకు చెందిన మరో మహిళను మోసం చేసి రూ.1.80 లక్షలను
రూ.1.80 లక్షలు స్వాహా
కర్నూలు, మే 30: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఓ మహిళ కర్నూలుకు చెందిన మరో మహిళను మోసం చేసి రూ.1.80 లక్షలను స్వాహా చేసింది. టూటౌన్ సీఐ మహేశ్వరరెడ్డి తెలిపిన వివరాలివి.. కర్నూలు వెంకటరమణ కాలనీకి చెందిన అన్నపూర్ణ అనే మహిళకు ఫేస్బుక్లో రోస్లిక్యాథరిన్ అనే మహిళ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. రోస్లి క్యాథరిన్ కొన్ని రోజులపాటు అన్నపూర్ణతో చాట్ చేసింది. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వీరు ఒకరికొకరు ఫోన్ నెంబర్లు ఇచ్చుకున్నారు. వేరే దేశంలో ఉంటున్నట్లు రోస్లిక్యాథరిన్ అన్నపూర్ణతో చెప్పింది. నీకోసం విలువైన బహుమతులు భారతదేశానికి పంపుతున్నానని నమ్మించింది. ఆ తర్వాత ఓ నెంబరు నుం చి అన్నపూర్ణకు ఫోన్ వచ్చింది. తాము కస్టమ్స్ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పారు.
మీకు పార్సిల్ వచ్చిందని, ఆ పార్సల్ మీకు పం పాలంటే రూ.13,750 పంపాలని చెప్పారు. దీంతో ఆ మొత్తాన్ని అన్నపూర్ణ వారు చెప్పిన ఖాతాకు బదిలీ చేశారు. అదే రోజు మళ్లీ సాయంత్రం రూ.46,750 పంపాలని తెలిపారు. ఈనెల 20న మరో సారి రూ.1.15 లక్షల నగదు మొత్తాన్ని జమ చేశారు. ఇలా మొత్తం 1.80 లక్షల నగదును అన్నపూర్ణ పంపించారు. అయితే ఎలాంటి బహుమతి రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన అన్నపూర్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.