కేంద్ర ప్రభుత్వ సూచనలు పాటించాలి

ABN , First Publish Date - 2020-05-13T10:11:15+05:30 IST

కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సూచనలను ప్రజలంతా పాటించాలని కేంద్ర బృందం సభ్యురాలు,

కేంద్ర ప్రభుత్వ సూచనలు పాటించాలి

 ప్రజలకు కేంద్ర బృందం సూచన


నంద్యాల, మే 12:  కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సూచనలను ప్రజలంతా పాటించాలని కేంద్ర బృందం సభ్యురాలు, ఆల్‌ ఇండియా ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ హైజిన్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మధుమిత దూబె, ప్రొఫెసర్‌ డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ సాధుఖాన్‌ సూచించారు. మంగళవారం కేంద్ర బృందం సభ్యులు జాయింట్‌ కలెక్టర్‌ రవిపట్టాన్‌ శెట్టి, జాయింట్‌ కలెక్టర్‌ -2 ఖాజామోహిద్దీన్‌, పోలీస్‌ ప్రత్యేక పర్యవేక్షణాధికారి ఎస్పీ శ్రీకాంత్‌ నంద్యాలలో పర్యటించారు. దళితవాడలో పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫీవర్‌ ఆసుపత్రిని, మండలంలోని చాపిరేవుల పీహెచ్‌సీ పరిధిలో ఏర్పాటు చేసిన సామాజిక క్వారంటైన్‌ కేంద్రాన్ని కేంద్ర బృందం పరిశీలించింది.


అర్బన్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు, ప్రాంతాల వారీగా రెడ్‌జోన్ల ఏర్పాటు, పాజిటివ్‌ కేసులకు సంబంధించి ప్రైమరీ, ద్వితీయ కాంటాక్టు వ్యక్తులను గుర్తించి ఐసొలేషన్‌కు పంపించుట, రెడ్‌జోన్‌ ఏరియాలలో పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలు, తదితర అంశాలపై మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటకృష్ణ, ఆర్డీవో రామకృష్ణారెడ్డి, వైద్యులు డాక్టర్‌ అంకిరెడ్డి, డాక్టర్‌ జయచంద్ర, డీఎస్పీ చిదానందరెడ్డి కేంద్ర బృందానికి వివరించారు.


ఫీవర్‌ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత, వైద్య సదుపాయాలకు సంబంధించి ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అని కేంద్ర బృందం సిబ్బందిని అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. రెడ్‌జోన్‌గా ఉన్న దళితవాడలో స్థానికులతో కేంద్ర బృందం మాట్లాడారు. నిత్యావసర సరుకులు, పాలు, పండ్లు, కూరగాయలు పంపిణీ, ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చాపిరేవుల పీహెచ్‌సీలో సామాజిక క్వారంటైన్‌ను పరిశీలించారు. కేంద్ర బృందం వెంట స్థానిక రెవెన్యూ, పోలీస్‌, మున్సిపల్‌ అధికారులు, వైద్యాధికారులు, ఉన్నారు.

Updated Date - 2020-05-13T10:11:15+05:30 IST