31న రాత్రి 9గంటల వరకే..
ABN , First Publish Date - 2020-12-28T04:52:35+05:30 IST
త్వరలోనే అనంతపురంలో సెబ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చెన్నకేశవరావు తెలిపారు.
మహానంది, డిసెంబరు 27: త్వరలోనే అనంతపురంలో సెబ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చెన్నకేశవరావు తెలిపారు. ఆదివారం మహానంది ఆలయంలో ఆయన కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడారు. ప్రభుత్వ మద్యం షాపుల నుంచి పరిమితికి మించి అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి మూడు, నాలుగు మద్యం దుకాణాలకు ఒక కానిస్టేబుల్ లేదా హెడ్ కానిస్టేబుల్ను పర్యవేక్షణ కోసం నియమించినట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ మధ్యం దుకాణాల నుంచి బెల్ట్షాపులకు మద్యం తరలిస్తే అందుకు ఆయా కానిస్టేబుళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. గతంలో బెల్ట్ షాపులు నిర్వహించి ప్రస్తుతం ఇతర వ్యాపారాలు చేసుకొనే వారిని కొంతమంది సిబ్బంది మాముళ్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తూన్నాయని, అలాంటి వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈనెల 31న ప్రతిరోజు మాదిరిగానే రాత్రి 9గంటల వరకు మాత్రమే మద్యం దుకాణాలను తెరచి ఉంచనున్నట్లు తెలిపారు. క్రైమ్ కంట్రోల్ బాధ్యత సెబ్ అధికారులకు ప్రభుత్వం కల్పించిందన్నారు. వీరివెంట ఎక్సైజ్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.