క్షేత్ర పవిత్రతకు భంగం కలిగించొద్దు
ABN , First Publish Date - 2020-12-29T05:45:07+05:30 IST
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్ల క్షేత్ర పవిత్రతకు భంగం కలిగించొద్దని శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎంఎల్ఎ బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు.
- కుల, మత రాజకీయాలు మానుకోండి
- మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి
శ్రీశైలం, డిసెంబరు 28: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్ల క్షేత్ర పవిత్రతకు భంగం కలిగించొద్దని శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎంఎల్ఎ బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. సోమవారం ఆయన స్వామి అమ్మవార్లను దర్శించుకొని శివదీక్షా విరమణ చేశారు. అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ శ్రీశైలం క్షేత్ర ప్రతిష్ఠకు భంగం కలిగించొద్దని, క్షేత్రంపై ఆరోపణలు చేస్తూ దేవస్థానం పరువును, భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని చేతులెత్తి మొక్కారు. కేవలం కుల మత రాజకీయాలకు క్షేత్రాన్ని వాడుకొంటున్నారని వైసీపీ, బీజేపీ నాయకులపై మండిపడ్డారు. తెలుదేశం ప్రభుత్వంలోనే శ్రీశైలం క్షేత్రం అభివృద్ధి చెందిందన్నారు. తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలని బీజేపీ, వైసీపీలు డ్రామాలు ఆడుతున్నాయన్నారు. తమ హయాంలో 30-40 ఏళ్లుగా నివసిన్తున్న వారికే పాతాళగంగ రోడ్డులో షాపులను ఇప్పించామని, కొందరు వాటిని షెడ్లుగా మారిస్తే దేవస్థానం చర్యలు తీసుకుంటే తాము సహకరించామని అన్నారు. శ్రీశైలంలో నివాసం ఉంటున్నవారికి స్థలాలు ఇప్పించి ఇళ్లు కట్టిస్తానని శిల్పా చక్రపాణి రెడ్డి హామీ ఇచ్చారని, ఇప్పుడు స్థలమే లేదు ఇళ్లు ఎలా కట్టిస్తారని అన్నారు. శ్రీశైలంలో వైసీపీ నాయకుల దౌర్జన్యాలు అధికమయ్యాయని ఆరోపించారు. విద్వేషాలు, రెచ్చగొట్టే మాటలు ఆపి క్షేత్రం అభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు. దేవస్థానం అభివృద్ధిలో భాగంగా అక్కడ ఉండే వారికి సున్నిపెంటలో స్థలం కేటాయించి పట్టాలు ఇచ్చామన్నారు దేవస్థానం సిబ్బందికి క్వార్టర్స్ నిర్మాణం చేపట్టామని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులన్నీ అటకెక్కాయని ధ్వజమెత్తారు.