పద్యాలు, కవుల పేర్లు అడిగారు
ABN , First Publish Date - 2020-12-20T05:21:36+05:30 IST
రుద్రవరం కస్తూర్బాగాంధీ పాఠశాలను శనివారం డీఈవో సాయిరామ్, సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వేణుగోపాల్, ఈఈ రాఘప్ప, ఇన్చార్జి ఎంఈవో మహబూబ్ బాషా తనిఖీ చేశారు.

- పాఠశాలను తనిఖీ చేసిన అధికారులు
రుద్రవరం, డిసెంబరు 19: రుద్రవరం కస్తూర్బాగాంధీ పాఠశాలను శనివారం డీఈవో సాయిరామ్, సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వేణుగోపాల్, ఈఈ రాఘప్ప, ఇన్చార్జి ఎంఈవో మహబూబ్ బాషా తనిఖీ చేశారు. నాడు-నేడు పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. పాత డెస్క్లకే మరమ్మతులు చేయించాలని ప్రిన్సిపాల్ లక్ష్మీదేవిని ఆదేశించారు. పాత డెస్క్లు మరమ్మతులు చేయించడం వల్ల డబ్బులు వృథా అవుతున్నాయని ప్రిన్సిపాల్ లక్ష్మీదేవి డీఈవోకు వివరించారు. పాత డెస్క్లకే జాగ్రత్తగా మరమ్మతులు చేయించాలని ఆయన ఆదేశించారు. బోధన చేసే బోర్డులకు రంగులు పడటంతో సరిగా అంటవు కదా అని ప్రశ్నించారు. అలాగే బల్బులపై రంగులు పడటంతో వెలుతురు తక్కువ అవుతుందని అన్నారు. ఆన్లైన్లో విద్యార్థులకు బోధన సక్రమంగా చేస్తున్నారా? విద్యార్థులు ఆన్లైన్లో విద్యాబోదన పొందుతున్నారా? అని సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ వేణుగోపాల్ ప్రశ్నించారు. ఉపాధ్యాయులను పద్యాలు, కవుల పేర్లు చెప్పాలని అడిగారు. మరోసారి పాఠశాలను తనిఖీ చేస్తామని, అప్పుడుసమాధానం చెప్పకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పాఠశాలలో కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించారు.
‘పాజిటివ్ కేసులు లేవు’
కస్తూర్బాగాంఽధీ గురుకుల విద్యాలయంలో పాజిటివ్ కేసులు లేవని ప్రిన్సిపాల్ లక్ష్మీదేవి తెలిపారు. ఇంటర్ విద్యార్థిని పాజిటివ్ అని వైద్యాధికారులు జాబితాలో చేర్చారు. ఇంటర్ చదువుతున్న విద్యార్థిని చెల్లెలికి పాజిటివ్ వచ్చింది. చెల్లెలి పేరు చూపించకుండా అక్క పేరు జాబితాలో చూపించారని తెలిపారు. అలాగే పాఠశాలలోని ఓ సిబ్బంది భర్తకు శనివారం పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. పాఠశాలలో మాత్రం ఎవరికీ రాలేదని చెప్పారు.