మంత్రాలయం, సంగమేశ్వరంలో సందడి
ABN , First Publish Date - 2020-11-24T06:19:32+05:30 IST
తుంగభద్ర పుష్కరాలకు వచ్చిన భక్తులతో మంత్రాలయం క్షేత్రం నాలుగో రోజు కిటకిటలాడింది.
- కిక్కిరిసిన పుష్కర ఘాట్లు
ఎమ్మిగనూరు టౌన్/మంత్రాలయం/ఆత్మకూరు, నవంబరు 23: తుంగభద్ర పుష్కరాలకు వచ్చిన భక్తులతో మంత్రాలయం క్షేత్రం నాలుగో రోజు కిటకిటలాడింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాల నుంచి సోమవారం పెద్ద ఎత్తున తరలివచ్చారు. సంత మార్కెట్, వినాయక ఘాట్, మఠం ఘాట్ వద్ద పుష్కర స్నానాల కోసం భక్తులు పోటేత్తారు. నదిలోకి అనుమతి లేకపోవడంతో షవర్ల కిందే పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం నదీమతల్లికి ప్రత్యేక పూజలు చేసి దీపాలను వెలిగించి వదిలి మొక్కులు తీర్చుకున్నారు. చీర, సారె, పసుపు, కుంకుమలను నదికి సమర్పించారు.
ఘాట్ల వద్ద చిన్నారులు, యువతీ యువకులు సందడి చేశారు. పలువురు సెల్ఫీలు తీసుకున్నారు. ఘాట్ల వద్ద పిండ ప్రదానం చేశారు. ఓ అఘోరా సాధువు శంఖం పూరిస్తూ ఆకట్టుకు న్నారు. ఘాట్ల వద్ద ఆర్డీవో రామకృష్ణా రెడ్డి, డీఎస్పీ వినోద్కుమార్, సీఐ కృష్ణయ్య, ఎమ్మిగనూరు పట్టణ ఎస్ఐ వెంకటరాముడు, మంత్రాలయం ఎస్ఐలు వేణుగోపాల్రాజు, ఎర్రన్న, మాధవరం ఎస్ఐ బాబు భద్రతను పర్యవేక్షించారు.
పుష్కర జలాభిషేకం
సప్తనదీ సంగమేశ్వర క్షేత్రంలో లలితాసంగమేశ్వర ఉత్సవ విగ్రహాలను ప్రధాన పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ పుష్కర జలాలచే అభిషేకించారు. సాయంత్రం 6గంటల సమయంలో పుష్కర జలాలకు సంధ్యాహారతిని నివేదించారు. మహిళలు సప్తనదీ జలాల్లో దీపాలు వదిలి వాయనాలను సమర్పించారు. సుమారు 1500 మంది భక్తులు క్షేత్రానికి తరలివచ్చినట్లు అధికారులు అంచనా వేశారు.
తుంగభద్రకు పుష్కర హారతులు
కర్నూలు (కల్చరల్): తుంగభద్ర పుష్కరాల్లో భాగంగా సంకల్బాగ్లోని వీఐపీ పుష్కర ఘాట్లో సోమవారం ఉదయం లోక కళ్యాణం కోసం విభిన్న హోమాలు నిర్వహిస్తున్నారు. నిత్యం సాయంత్రం నదీ హారతులు ఇస్తున్నారు. నదీమతల్లికి పుష్కర హారతులు దర్శించేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. మహానంది పుణ్య క్షేత్రంలో వేద పండితులు రవిశంకర్ అవధాని ఆధ్వర్యంలో నిత్య హోమాలు, నదీ హారతులు కొనసాగుతున్నాయి. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని శివున్ని ఆరాధిస్తూ మహారుద్ర హోమం నిర్వహించారు. సాయంత్రం నదీమతల్లికి పూజలు చేసి, కుంభ హారతి, నంది హారతి, బిల్వ హారతి, నాగ హారతి, నక్షత్ర హారతి ఇచ్చారు. మంగళవారం కార్తీక హోమం, కాలసర్ప హోమం నిర్వహిస్తామని రవిశంకర అవధాని తెలిపారు