‘రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి’
ABN , First Publish Date - 2020-12-06T05:00:26+05:30 IST
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సీపీఎం పట్టణ కార్యదర్శి ఏసురత్నం, నాయకులురణధీర్, నరసింహనాయక్, మాబాషా, సుధాకర్ డిమాండ్ చేశారు.

ఆత్మకూరు రూరల్, డిసెంబరు 5: కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సీపీఎం పట్టణ కార్యదర్శి ఏసురత్నం, నాయకులురణధీర్, నరసింహనాయక్, మాబాషా, సుధాకర్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని బస్టాండ్ ఎదుట కేజీ రహదారిపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. నాయకులు మాట్లాడుతూ రైతుల చేతుల్లో ఉన్న వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను సవరించిందని ఆరోపించారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించడం తగదని, రైతుల ప్రయోజనాల దృష్ట్యా మీటర్ల ఏర్పాటు ప్రక్రియను ఉపసంహరిచుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే కేంద్రం ప్రవేశ పెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఎం నాయకులు రామ్నాయక్, వీరన్న, శివుడు, గణపతి, దినేష్, మల్లయ్య, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
జూపాడుబంగ్లా: ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనదీక్షలకు మద్దతుగా శనివారం జూపాడుబంగ్లా తహసీల్దార్ కార్యాలయం ఎదు ట సీపీఎం పార్టీ రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. కేంద్రప్రభుత్వం అమలు చేసిన రైతు వ్యతిరేక బిల్లును ఉపసంహరించాలని పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల రైతులు చేస్తున్న దీక్షను భగ్నం చేయడమే కాకుండా రైతులపై లాఠీచార్జీ చేయించడం తగదని అన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. అనంతరం తహసీల్దార్ పురుషోత్తం, ఎస్ఐ తిరుపాలుకు వినతిపత్రం అందజేశారు. సీపీఎం నాయకులు నాగేశ్వరరావు, భాస్కరరెడ్డి, పక్కీర్ సాహెబ్, కర్ణ త దితరులు పాల్గొన్నారు.