చెక్పోస్టుల వద్ద నిరంతర నిఘా
ABN , First Publish Date - 2020-05-13T10:09:21+05:30 IST
చెక్పోస్టుల వద్ద నిరంతర నిఘా ఉంచాలని ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశించారు.
ఎస్పీ ఫక్కీరప్ప
కర్నూలు, మే 12: చెక్పోస్టుల వద్ద నిరంతర నిఘా ఉంచాలని ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశించారు. మంగళవారం కర్నూలు జిల్లా సరిహద్దు వద్ద ఆంధ్రప్రదేశ్-తెలంగాణ బార్డర్లలోని చెక్పోస్టులను, పుల్లూరు టోల్ప్లాజాను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐ మహమ్మద్ గౌస్, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పాస్లు ఉన్న వారినే జిల్లాలోకి అనుమతించాలన్నారు. వలస కూలీలు జిల్లాలోకి వస్తే కరోనా మెడికల్ టెస్టులు చేయించాలన్నారు. కరోనా లక్షణాలు లేని వారిని స్వగ్రామాలకు పంపేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత పోలీస్స్టేషన్ ఎస్ఐలు, తహసీల్దార్లకు సమాచారం అందజేయాలని తెలిపారు. నిత్యావసరాలకు సంబంధించి గూడ్స్ వాహనాలను తనిఖీ చేసి జిల్లాలోకి అనుమతించాలన్నారు.
రెడ్జోన్ ప్రాంతాల్లో తనిఖీ
నాలుగో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎల్.వెంకయ్యనగర్ రెడ్జోన్ ప్రాంతాన్ని ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాలినడకన పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. బారికేడ్లు ఏర్పాటు చేసుకోవాలని సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ శేషయ్యనాయుడుకు సూచనలు చేశారు. రెడ్జోన్లలో ప్రజలు బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. బారికేడ్లు పకడ్బందీగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.