అర్ధరాత్రి నుంచే ప్రార్థనలు..
ABN , First Publish Date - 2020-12-25T06:02:55+05:30 IST
మానవజాతి సుఖశాంతులతో జీవించాలని, మనుషులు ప్రేమ, కరుణ, దయాగుణాలు కలిగి ఉండాలని ఏసుక్రీస్తు ప్రబోధించారు.
![అర్ధరాత్రి నుంచే ప్రార్థనలు..](https://media.andhrajyothy.com/appimg/galleries/2020122512311394/12252020003159n53.jpg)
కర్నూలు(కల్చరల్): మానవజాతి సుఖశాంతులతో జీవించాలని, మనుషులు ప్రేమ, కరుణ, దయాగుణాలు కలిగి ఉండాలని ఏసుక్రీస్తు ప్రబోధించారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా క్రిస్మస్ వేడుకను శుక్రవారం నిర్వహించేందుకు క్రైస్తవులు సిద్ధమయ్యారు. జిల్లాలోని చర్చిలను విద్యుద్దీపాలతో అలంకరించారు. చర్చిలపై నక్షత్రాలను ఎగురవేశారు. క్రీస్తు జనన వృత్తాంతాన్ని తెలియజేసే పశువుల పాక నమూనాలను ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలను పారంభించారు.
జిల్లా వ్యాప్తంగా వేడుకలు
క్రిస్మస్ వేడుకలకు జిల్లా వ్యాప్తంగా అన్ని చర్చిలు ముస్తాబయ్యాయి. నగరంలోని పెద్దపార్కు వద్దనున్న సీఎస్ఐ చర్చి, కోట్ల సర్కిల్లోని కోల్స్ సెంటీనియల్ తెలుగు బాప్టిస్టు చర్చి, శ్రీనివాస నగర్లోని స్టాంటన్ చర్చి, ఐదు రోడ్ల కూడలిలోని రాక్వుడ్ చర్చి, సి.క్యాంపులోని ప్రార్థన మందిరం, నంద్యాల చెక్పోస్టు సమీపంలోని బిషప్ చర్చి, చిన్న పార్కు సమీపంలోని థెరీసమ్మ చర్చితోపాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని చర్చిలను క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు కొన్ని చర్చిల్లో గురువారం అర్ధరాత్రి నుంచి ప్రారంభించారు. చర్చి ప్రాంగణాలలో క్రిస్మస్ స్టార్లు, క్రిస్మస్ ట్రీలు, క్రిస్మస్ బెల్స్, బెలూన్లు, రంగు కాగితాల తోరణాలను ఏర్పాటు చేశారు.