రోడ్లకు మరమ్మతులు చేయాలి
ABN , First Publish Date - 2020-12-06T05:16:18+05:30 IST
ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా మారినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వెంటనే మరమ్మతులు చేయించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
- బీజేపీ నాయకుల ఆందోళన
కోవెలకుంట్ల, డిసెంబరు 5: ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా మారినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వెంటనే మరమ్మతులు చేయించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. వివిధ ప్రాంతాల్లో శనివారం ఆందోళనలు చేపట్టారు. కోవెలకుంట్లలో పార్టీ మండల అధ్యక్షుడు మందుల సీతారామయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని ముదిగేడు సర్కిల్ వద్ద ధర్నా చేశారు. నాయకులు అప్పపోగుల వెంకటసుబ్బయ్య, అగర్తల, చాందిని, మహిళా మోర్చా నాయకురాలు గోనవరం నాగేశ్వరమ్మ, మండల నాయకులు కైప ప్రభాకర్, వెంకటసుబ్బయ్య, గుర్రప్ప, కిసాన్ మోర్చా నాయకులు కలుగొట్ల నరసింహారెడ్డి చినబాబు, యువ మోర్చా నాయకులు వై భూపాల్రెడ్డి, మల్లికార్జున పాల్గొన్నారు.
పాణ్యం: అధ్వానంగా మారిన రోడ్లకు మరమ్మతుల చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మండల అధ్యక్షుడు మద్దిలేటి ఆధ్వర్యంలో పాణ్యంలోని బీసీ కాలనీలో నిరసన చేపట్టారు. జాతీయ రహదారిపై బస్టాండు సమీపంలో, కొండజూటూరు, గోరుకల్లు, అనుపూరు, కొత్తూరు రహదారులలో గుంతలు ఏర్పడి నిత్యం వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదన్నారు.
మహానంది: రహదారులు బాగు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం నందిపల్లె మెట్టవద్ద నంద్యాల - ఒంగోలు జాతీయ రహదారిపై బీజేపీ మండల కన్వీనర్ నందిపల్లె మహేష్ ఆధ్వర్యంలో బైఠాయించి వాహన రాకపోకలకు అడ్డుకున్నారు. మహేష్ మాట్లాడుతూ వరదల వల్ల రహదారులు గుంతలు పడి అధ్వానంగా మారాయన్నారు. వైసీపీ ప్రభుత్వం వెంటనే స్పందించిన నంద్యాల నుంచి ఒంగోలు వరకు నిర్మించిన జాతీయ రహదారిలో తాత్కాలిక మరమ్మతులు కాకుండా శాశ్వత పనులు చేసి వాహన రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని కోరారు. నంద్యాల నుంచి గిద్దలూరు వైపు వెళ్లే వాహనాలకు అంతరాయం ఏర్పడింది. నాయకులు ఆర్ఎస్ సుధాకర్, ఖలీల్ బాషా, బాల నాని, జంబులయ్య, వెంకటేశ్వర్లు, మధు, రాజశేఖర్, దావీదు, నరసింహులు, శేషు తదితరులు పాల్గొన్నారు.
బండి ఆత్మకూరు: వైసీపీ ప్రభుత్వం రోడ్లను పూర్తిగా గాలికి వదిలేసిందని బీజేపీ నాయకులు బిజ్జం సుబ్బారెడ్డి, భరతం వెంకట రామయ్య అన్నారు. శనివారం నంద్యాల-ఆత్మకూరు రోడ్డు అధ్వానంగా ఉందని ఎ.కోడూరులో నిరసన తెలిపారు. నాయకులు మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా గుంతలు ఏర్పడి రోడ్డు అధ్వానంగా ఉన్నా, ప్రజలు నానా అవస్థలు పడుతున్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు.