‘అరటి రైతులను ఆదుకోవాలి’
ABN , First Publish Date - 2020-12-28T05:22:23+05:30 IST
అరటికి ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు. చిన్నవంగలిలో రైతులు నిరసన తెలిపారు.
చాగలమర్రి, డిసెంబరు 27: అరటికి ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు. చిన్నవంగలిలో రైతులు నిరసన తెలిపారు. మార్కెట్ సౌకర్యం లేక పోవడంతో అరటి రైతులు వ్యాపారులు చెప్పిన ధరకే విక్రయించాల్సి వస్తోందని అన్నారు. కడప జిల్లాలో కిలో రూ.8 కొనుగోలు చేస్తే కర్నూలు జిల్లాలో కిలో రూ.2 మాత్రమే కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ధర తక్కువగా ఉన్న వ్యాపారులు ముందుకు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 100 ఎకరాల దాకా అరటి తోటలను తొలగించి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. గత ఏడాది టన్ను అరటి రూ.18 వేలు పలకడంతో ఈ ఏడాది 800 ఎకరాల దాకా సాగు చేశామని, అరటి గెలలు వచ్చేసరికి ధర రూ.2 వేలకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడులు కూడా రావని, దీంతో అరటి తోటలు తొలగిస్తున్నట్లు తెలిపారు. అధిక వర్షాలు, వైరస్ వల్ల తోటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం స్పందించి మార్కెట్ సౌకర్యం కల్పించి పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.