రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-12-06T04:49:52+05:30 IST

రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని శనివారం ఏపీ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రెప్రజెంటేటివ్స్‌ యూనియన్‌ కర్నూలు శాఖ కార్యదర్శి బసవరాజ్‌ డిమాండ్‌ చేశారు.

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
ధర్నా చేస్తున్న యూనియన్‌ నాయకులు

కర్నూలు(అగ్రికల్చర్‌), డిసెంబరు 5: రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని శనివారం ఏపీ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రెప్రజెంటేటివ్స్‌ యూనియన్‌ కర్నూలు శాఖ కార్యదర్శి బసవరాజ్‌ డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో సుమారు 34 రైతు సంఘాలు జరుపుతున్న ఉద్యమానికి మద్ద తుగా యూనియన్‌ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాలరాచి, కార్పొరేట్‌ శక్తులకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవసాయ బిల్లులను తీసుకువచ్చిందని విమర్శించారు. సీనియర్‌ నాయకులు ప్రసాద్‌శర్మ మాట్లాడుతూ రైతుల ఉద్యమానికి దేశ ప్రజలంతా బాసటగా నిలవాలని అన్నారు. ఈ నెల 8వ తేదీన దేశ వ్యాప్త సమ్మెలో అందరూ పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. 



రైతుల పోరాటానికి అవాజ్‌ కమిటీ సంఘీభావం

కర్నూలు(న్యూసిటీ), డిసెంబరు 5: ఢిల్లీలో జరుగుతున్న రైతులు పోరాటానికి అవాజ్‌ కమిటీ సంఘీభావం తెలుపుతోందని కమిటీ జిల్లా కార్యదర్శి ఎస్‌ఏ. సుభాన్‌ తెలిపారు. శనివారం రైతుల పోరాటానికి సంఘీభావంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు హానీ కలిగించే చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేసారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి పి. ఇక్బాల్‌, అబ్దుల్‌దేశాయ్‌, ఇలియాజ్‌, కరీం పాల్గొన్నారు. 


 దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటంపై బీజేపీ దమనకాండను ఖండిస్తూ ఈ నెల 8న జరిగే భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని ఆల్‌ ఇండియా కిసాన్‌ సంఘర్ష్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ  పిలుపునిచ్చింది. శనివారం కేకే భవన్‌లో వివిధ రైతు, ప్రజాసంఘాలు, రాజకీయపార్టీల నాయకులతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు రామక్రిష్ణ, కే. జగన్నాథం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల సమస్యలపై చర్చ జరగకుండా నిరంకుశంగా దాడులు చేయడం దారుణమన్నారు. ఈ సమావేశంలో వెంకటేశ్వర్లు, జయరాజు, గౌస్‌దేశాయ్‌, మునెప్ప, ఆర్లప్ప, శేషఫణి పాల్గొన్నారు. 


‘భారత్‌బంద్‌ను జయప్రదం చేయండి’ 

ఆదోని రూరల్‌: వ్యవసాయ బిల్లు రద్దు చేయాలని ఈ నెల 8వ తేదీన జరిగే భారత్‌బంద్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అఖిలపక్ష నాయకులు వెంకటేశ్వర్లు, లక్ష్మిరెడ్డి, మల్లికార్జున, వెంకన్న, అయ్యప్పగౌడ్‌, మనెమ్మ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్‌లో ఆమోదంలో పెట్టిన వ్యవసాయంకు సంబంధించిన చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఇందులో భాగంగానే హరియాణ, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, హిమాచలప్రదేశ్‌ తదితర రాష్ట్రాలు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని అందులో భాగంగానే ఈ నెల 8వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో శ్రీనివాసులు, నర్సప్ప, గోపాల్‌ పాల్గొన్నారు.

 

పత్తికొండ టౌన్‌: వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేసే చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేయాలని ఏపీ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య డిమాండ్‌ చేశారు. శనివారం సీఆర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని బహుళజాతి కంపెనీలకు కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టేందుకు ఇటీవల మూడు రైతాంగ వ్యతిరేక చట్టాలను మోదీ  ప్రభుత్వం తీసుకువచ్చిందని అన్నారు. వీటికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఉద్యమిస్తున్న రైతులు ఈనెల 8న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు గురుదాసు, మండల కార్యదర్శి రాజాసాహెబ్‌, రైతుసంఘం నియోజకవర్గ అధ్యక్షుడు కారన్న, ఎఐటీయుసీ నియోజకవర్గ కార్యదర్శి సుల్తాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-06T04:49:52+05:30 IST