74కు చేరిన కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-04-07T10:29:30+05:30 IST
జిల్లాలో గత వారం కరోనా పాజిటివ్ కేసులు..
కొత్తగా18 పాజిటివ్, 35 నెగెటివ్
పెండింగ్లో మరో 67 కేసులు
కంటెయిన్మెంటు జోన్లుగా పాజిటివ్ ప్రాంతాలు
కర్నూలు(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గత వారం కరోనా పాజిటివ్ కేసులు నాలుగు మాత్రమే నమోదు అయ్యాయి. దీంతో పరిస్థితి అదుపులోనే ఉంటుందని అధికారులు భావించారు. మూడు రోజుల్లో పరిస్థితి తారుమారు అయింది. ఏకంగా 74 పాజిటివ్ కేసులతో జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆదివారం ఒక్కరోజే 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సోమవారం మరో 18 కొత్త కేసులు జాబితాలో చేరాయి. ఇలా రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతుండటంతో జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
కరోనా నిర్ధారణ పరీక్షలకు పంపిన నమూనాల్లో సోమవారం 53 అనుమానితుల నివేదికలు వచ్చాయి. వీరిలో 18 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. 35 మందికి వైరస్ సోకలేదని కలెక్టర్ వీరపాండియన్ ప్రకటించారు. ల్యాబ్ నుంచి మరో 67 మంది నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. రేపో మాపో అవి కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో ఉలిక్కిపడ్డ జిల్లా అధికార యంత్రాంగం లాక్డౌన్ను మరింత పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించింది. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలలో అధికారులు మరిన్ని ఆంక్షలు విధించారు. వాటిని కంటెయిన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టారు.
జన సంచారం లేకుండా చూస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా నుంచి 463 మంది అనుమానితుల నుంచి నమూనాలను సేకరించి తిరుపతి, అనంతపురం ల్యాబ్లకు పంపారు. సోమవారం సాయంత్రం వరకూ వచ్చిన రిపోర్టుల ప్రకారం 219 మందికి కరోనా లేదని తేలింది. కరోనా బాధితులు పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాజిటివ్గా తేలినవారిని కోవిడ్ హాస్పిటల్స్కు తరలించి వైద్యం చేస్తున్నారు. వీరిని కలిసినవారిని, కుటుంబ సభ్యులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.