విజయవాడలో ఫ్యాప్టో ఆందోళన...ఉద్రిక్తం

ABN , First Publish Date - 2020-12-11T18:20:35+05:30 IST

ఉపాధ్యాయుల బదిలీలను పోస్టులను బ్లాక్‌ చేయడం పట్ల ఫ్యాప్టో ఆందోళనకు దిగింది.

విజయవాడలో ఫ్యాప్టో ఆందోళన...ఉద్రిక్తం

విజయవాడ: ఉపాధ్యాయుల బదిలీల్లో పోస్టులను బ్లాక్‌ చేయడం పట్ల ఫ్యాప్టో ఆందోళనకు దిగింది. శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని ఫ్యాప్టో ముట్టడించింది. వేలాదిగా ఉపాధ్యాయులు రావడంతో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. రేపటి నుండి విజయవాడలో నిరవధిక ధర్నాలు చేస్తామని ఫ్యాప్టో స్పష్టం చేసింది. ఈ సందర్భంగా...


ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్ చైర్మన్ జి బి నారాయణ రెడ్డి మాట్లాడుతూ... స్వాతంత్య్రం వచ్చాక ఉపాధ్యాయులు బదిలీల్లో 40 నుండి 50 శాతం పోస్టులు బ్లాక్ చేయడం ఇదే ప్రధమమన్నారు. దీనితో విద్యా వ్యవస్థకు తీరని నష్టం వాటిల్లుతోందని తెలిపారు. చిన్న పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోతున్నాయని... మరికొన్ని పాఠశాలలలో ఉపాధ్యాయుల కొరత ఏర్పడుతుందని చెప్పుకొచ్చారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోస్టులు వెబ్‌లోనే బ్లాక్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కొత్త పద్ధతిని తెచ్చి మొండిగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ కమిషనర్, సెక్రటరీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాన్యువల్ కౌన్సిలింగ్‌కు సంబంధించి కనీసం ఎస్ జి టికి మాన్యువల్ కాన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇంగ్లీష్ మీడియం ఆప్ట్ చేసిన విద్యార్థులు వీరి తప్పుడు సాఫ్ట్‌వేర్ వళ్ల తెలుగు మీడియంలోకి పడుతున్నారన్నారు. అది తమ తప్పు కాదని నారాయణ రెడ్డి తెలిపారు.


ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ... ప్రభుత్వ వైఖరి వల్ల ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కారని విమర్శించారు. ప్రతి ఏడాది డిసెంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చి జనవరిలో బదిలీలు చేస్తామన్న ప్రభుత్వం మాట తప్పిందన్నారు. మీడియం చేంజ్ వల్ల కొన్ని పాఠశాలలు పోస్టులు కోల్పోతున్నారన్నారు. కమిషనర్, సెక్రటరీలను తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. 


యూటీఎఫ్ నేత బాబిరెడ్డి మాట్లాడుతూ... వెబ్ కౌన్సిలింగ్ వద్దని ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేశారన్నారు. ఇప్పుడు ఈ అధికారులు వచ్చాక ఇది ప్రారంభించారని మండిపడ్డారు. ఈ రోజు ఇప్పటికే కౌన్సెలింగ్ ప్రారంభమైనా వెబ్ ఆప్షన్‌లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వెబ్‌లో దాచిన ఖాళీలను  అమ్ముకోవలని చూస్తున్నారనే అనుమానాలు తమకు ఉన్నాయని తెలిపారు. 

Updated Date - 2020-12-11T18:20:35+05:30 IST