పామర్రులో ప్రలోభాల వల
ABN , First Publish Date - 2020-03-15T10:18:17+05:30 IST
పామర్రు-2 సెగ్మెంట్ నుంచి పోటీలో నిలిచిన టీడీపీ అభ్యర్థి శీలం శివపార్వతి శనివారం తన నామినేషన్
![పామర్రులో ప్రలోభాల వల](https://media.andhrajyothy.com/appimg/galleries/202003150445013/03152020044808n37.jpg)
పామర్రు, మార్చి 14 : పామర్రు-2 సెగ్మెంట్ నుంచి పోటీలో నిలిచిన టీడీపీ అభ్యర్థి శీలం శివపార్వతి శనివారం తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. తన భర్తతో కలిసి ఆర్వో కార్యాలయానికి వెళ్లిన ఆమె ఏడుస్తూ బయటకు వచ్చారు. దీనిపై టీడీపీ నేతలు ఆమెను ప్రశ్నించగా, ఒత్తిళ్ల కారణంగా ఉపసంహరణ చేయాల్సి వచ్చిందన్నారు. దీంతో ఎమ్మెల్యే అనీల్కుమార్తో పాటు వైసీపీ నేతల ప్రోత్సాహంతో ఆమె నామినేషన్ ఉపసంహరించుకున్నారని టీడీపీ నేతలు ఎమ్మెల్యేతో స్వల్ప వాగ్వాదానికి దిగారు.
పోటీలో నిలిచే ప్రతిపక్ష అభ్యర్థులతో ఎమ్మెల్యే ఎంపీపీ కార్యాలయానికి రావడం ఏమిటని ప్రశ్నించారు. తాను ఎవరిని ప్రలోభాలకు గురిచేశానో చెప్పాలని ఎమ్మెల్యే అనీల్ టీడీపీ నేతలను ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య స్వల్ప వివాదం జరిగింది. సీఐ ఎం.కిషోర్బాబు తన సిబ్బందితో అందరినీ చెదరగొట్టారు. అలాగే, పెదమద్దాలి సెగ్మెంట్ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులను, పామర్రు-5 సెగ్మెంట్ అభ్యర్థిని కూడా అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేసింది. దీనిపై పామర్రు ఎంపీపీ కార్యాలయంలో శనివారం టీడీపీ నేతలు ప్రెస్మీట్ ఏర్పాటుచేసి మండిపడ్డారు. నాయకులు గొట్టిపాటి లక్ష్మీదాసు, కుదరవల్లి ప్రవీణ్చంద్ర, లాజరస్, చాట్ల పున్నమ్మ, ఆరుమళ్ల గంగాభవానీ, ఈడే నాని, సందీప్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.