రేషన్ తొలి విడత కమీషన్కు గ్రీన్సిగ్నల్
ABN , First Publish Date - 2020-05-09T07:32:23+05:30 IST
రేషన్ డీలర్ల గోడును ఎట్టకేలకు సివిల్ సప్లయిస్ ఉన్నతాధికారులు ఆలకించారు.
ఆంధ్రజ్యోతి, విజయవాడ : రేషన్ డీలర్ల గోడును ఎట్టకేలకు సివిల్ సప్లయిస్ ఉన్నతాధికారులు ఆలకించారు. తొలి విడత ఉచిత నిత్యావసరాల పంపిణీకి సంబంధించిన కమీషన్ విడుదలపై స్పష్టతనిచ్చారు. మార్చి 29వ తేదీ నుంచి చేపట్టిన తొలి విడత పంపిణీకి సంబంధించిన కమీషన్ను 24 గంటల్లో ఎస్సీఎం ఖాతాల్లో జమ చేస్తామని రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఎండీ సూర్యకుమారి శుక్రవారం చెప్పారు. రాష్ట్ర ఫెయిర్ ప్రైస్ రేషన్షాప్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మండాది వెంకటరావు, పలువురు నేతలు శుక్రవారం ఎండీ సూర్యకుమారిని కలిశారు. ఉచిత నిత్యావసరాల పంపిణీకి సంబంధించి మూడు విడతలుగా కమీషన్ను చెల్లించటం లేదని, డీలర్లకు ఇబ్బందిగా ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. నాల్గో విడత కూడా రాబోతోందని చెప్పారు. దీనిపై సూర్యకుమారి సానుకూలంగా స్పందించారు. 24 గంటల్లో తొలి విడత కమీషన్ ఖాతాల్లో వేస్తామని, వారంలో రెండు, మూడో విడతల కమీషన్ను కూడా వేస్తామని హామీ ఇచ్చారు. డీలర్లు గన్నీబ్యాగులను ప్రభుత్వానికి ఇవ్వాలని, బ్యాగుకు రూ.16 చెల్లిస్తామని చెప్పారు.
దీనికి అసోసియేషన్ నేత మండాది అంగీకరించారు. మొదటి విడత కమీషన్ విడుదల కానున్నందున డీలర్లు నాల్గో విడతలో పంచదారకు డీడీలు కట్టడానికి సంసిద్ధం కావాలని సూచించారు. డీలర్లందరికీ ఈ మేరకు సరుకు దింపుకోవాలని సమాచారం ఇచ్చినట్టు మండాది చెప్పారు. డీలర్ల సమస్యలపై స్పందించినందుకు ఎండీ సూర్యకుమారి, కమిషనర్ కోన శశిధర్, జేసీ మాధవీలతకు ఆయన కృతజ్ఞతలు తె లియజేశారు.