బీసీలను మాటలతోనే మోసం చేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ : బోండా
ABN , First Publish Date - 2020-10-19T23:33:17+05:30 IST
బీసీలను మాటలతోనే మోసం చేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అని...

విజయవాడ : బీసీలను మాటలతోనే మోసం చేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. ఇవాళ విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. పొలిట్ బ్యూరోలో చోటు కల్పించిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు చేస్తున్న అవినీతి, మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని బోండా తెలిపారు. టీడీపీ హయాంలో బీసీలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే చంద్రబాబు అనేక పథకాలు అమలు చేశారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
రూ. వెయ్యి కూడా ఇవ్వలేదు!
‘టీడీపీ హయాంలో బీసీలను వాళ్ల కాళ్ల పై వాళ్లు నిలబడేలా సబ్సిడీ రుణాలు అందించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వారి నిధులను పక్కదారి పట్టించారు. బీసీలకు అందాల్సిన రుణాలను ఇతర పథకాలకు మళ్లించి మోసం చేశారు. కొత్తగా బీసీ కార్పొరేషన్లు పెట్టి తమ సొంతవారికి పదవులు ఇచ్చుకున్నారు. ఛైర్మన్లు, డైరెక్టర్ల పోస్ట్లను కొనుక్కుని కూర్చుంటున్నారు. నిధులు, అభివృద్ధి లేకుండా వీళ్లంతా ఏమి చేస్తారో మంత్రులకే తెలియాలి. రైతులు నష్టపోతుంటే కనీసం సీఎం జగన్ వారిని పరామర్శించలేదు. రైతుల పేరు చెప్పి వెయ్యి కోట్లు తెచ్చుకున్న జగన్.. రైతులకు కనీసం వెయ్యి రూపాయలు కూడా ఇవ్వలేదు. రైతుల కన్నీటిని కనీసం పట్టించుకోకుండా.. వైసీపీ నేతలు అబద్దాలతో అసత్యాలు ప్రచారం చేయడం సిగ్గు చేటు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం.. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపుతాం’ అని బోండా చెప్పుకొచ్చారు.