అకారణంగా బయటికొస్తే బాదుడే!

ABN , First Publish Date - 2020-05-13T09:23:24+05:30 IST

మాస్క్‌లు లేకుండా ఎవరైనా బయటకొస్తున్నారా? దారిలో వెళుతూ రోడ్డుపై ఉమ్మి వేస్తు న్నారా? సరుకుల కోసం వెళ్లి

అకారణంగా బయటికొస్తే బాదుడే!

చిట్టినగర్‌, మే 12: మాస్క్‌లు లేకుండా ఎవరైనా బయటకొస్తున్నారా? దారిలో వెళుతూ రోడ్డుపై ఉమ్మి వేస్తు న్నారా? సరుకుల కోసం వెళ్లి దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించకుండా గుమిగూడుతున్నారా? ఇక మీకు జేబుకు చిల్లు తప్పదు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉపక్రమించేవారిపై కఠిన చర్యల్లో భాగంగా అపరాధరుసుం వసూలుకు నగర పాలక సంస్థ ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. ఉమ్మితే రూ.1000, మాస్క్‌ లేకుండా బయటకొచ్చినా, భౌతిక దూరం పాటించకున్నా రూ.100 ఫైన్‌ వేస్తోంది. 7నుంచి ఈ ప్రత్యేక బృందాలతో ప్రధాన కూడళ్లలో నిఘా పెట్టి నిబంధనలు మీరిన వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేస్తోంది.


నగరంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కట్టడి చేసేందుకు నగరపాలక సంస్థ ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు అకారణంగా రోడ్లపైకి వచ్చే వారిని నియంత్రించేందుకు చర్యలు  చేపట్టింది. మూడు సర్కిళ్లలో నలుగురు సభ్యులతో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. ప్రధాన కూడళ్లలో వారు నిఘా పెట్టి మాస్క్‌లు లేకుండా కనిపించినా, షాపుల వద్ద భౌతిక దూరం పాటించకుండా కనిపించినా, రోడ్లపై ఉమ్మినా అపరాధ రుసుం వసూలు చేస్తున్నారు. సర్కిల్‌-1 టీమ్‌ చిట్టి నగర్‌ జంక్షన్‌లో రూ 15,850, సర్కిల్‌-2 డాబా కొట్ల సెంటర్‌లో రూ.7,100, సర్కిల్‌-3 బెంజిసర్కిల్‌లో 11,800 మొబైల్‌ టీమ్‌లు రూ.13,700 మొత్తం రూ.48,450 వసూలు చేశారు.


 ప్రజలు నిత్యావసర సరకులకు అనుమతిచ్చిన సమయంలో తగు జాగ్రత్తలతో బయటకు వెళ్లాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు. ప్రధాన కూడళ్లతో పాటు వీధుల్లో సోడియం హైపో క్లోరైడ్‌ రసాయనం స్ర్పేయింగ్‌ చేయించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు.

Updated Date - 2020-05-13T09:23:24+05:30 IST