నిరాడంబరంగా రాములోరి కల్యాణం
ABN , First Publish Date - 2020-04-03T09:22:23+05:30 IST
అపర భద్రాద్రి మోటూరు సీతారామస్వామి ఆలయంలో కల్యాణమహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
బందరు, మోటూరు, చనుబండలలో అతికొద్ది మందితో..
గుడివాడరూరల్ : అపర భద్రాద్రి మోటూరు సీతారామస్వామి ఆలయంలో కల్యాణమహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేదపండితులు సంపత్ అయ్యంగార్,నల్లాన్ చక్రవర్తుల, చలమచర్ల మురళీకృష్ణమా చార్యులు, ఈవో సురేష్, ట్రైనీ డీఎస్పీ రమ్య పాల్గొన్నారు.
చాట్రాయి : చనుబండ కోదండ రామస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణం నిరాడంబరంగా జరిగింది. చాట్రాయి శ్రీరామచంద్రస్వామి, బూరుగగూడెం రామాలయం, ఆరుగొలనుపేట, చీపురుగూడెం రామాలయాల్లోనూ రాములోరి కల్యాణం జరిపించారు.
నందిగామ రూరల్: నందిగామ సీతారామ స్వామి ఆలయంలో కల్యాణాన్ని అర్చకులు దివి పార్థసారథాచార్యులు, వంశీకృష్ణమాచార్యులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఐతవరంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దంపతులు స్వామి వారికి పట్టు వస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించారు.
మచిలీపట్నం టౌన్ : మచిలీపట్నం భద్రాద్రి రామాలయంలో కేవలం వేదపండితులు, ధర్మకర్తలు, అధికారులు 12 మందితో ధర్మకర్త శ్రీమంతు రాజా యార్ల గడ్డ రామనాథ దేవీప్రసాద్ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం జరిగింది. ప్రముఖ వేదపండితుడు గుదిమెళ్ళ శ్రీకర రామానుజ బ్రహ్మత్వం వహించారు. పోలీసు రామాలయంలో ఐదుగురితో కల్యాణోత్సవం చేశారు. ఎస్పీ రవీంద్రనాథ్బాబు ఐదు నిమిషాలు తిలకించారు.
కలిదిండి: తాడినాడ సీతారామస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణం జరిగింది. ఈవో శింగనపల్లి శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ అచ్యుత రామరాజు, ధర్మకర్తలు పాల్గొన్నారు.
పెనుగంచిప్రోలు: తిరుపతమ్మ ఆలయంలో సీతారాముల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధానార్చకుడు మర్రెబోయిన వెంకటరమణ, పురోహితుడు శివరాంబొట్ల ఆంజనేయ శర్మ స్వామి కల్యాణం జరిపించారు. చైర్మన్ అత్తలూరి అచ్యుతరావు, చిట్టిమళ్ల ప్రసాదరావు పాల్గొన్నారు.
పామర్రు : ఉండ్రపూడి-పోలవరం అడ్డరోడ్డు వీరాంజనేయ దేవాలయంలో సీతారాముల కల్యాణం ఆలయ అధికారులు, సిబ్బంది నిరాడంబరంగా జరిపారు.
మిడిముక్కల: మంటాడలో అలివేలు మంగ పద్మావతి సమేత వైకుంఠ వేంకటేశ్వరస్వామి దేవస్థానం, శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి దేవస్థానాల్లో శ్రీసీతారామ స్వామి కల్యాణం నిర్వహించారు.