అంబానీ, అదానీల కోసమే వ్యవసాయ చట్టాలు: రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవరావు
ABN , First Publish Date - 2020-12-17T07:36:09+05:30 IST
ప్రధాని నరేంద్రమోడీకి దేశ ప్రజలు, రైతుల ప్రయోజనాల కంటే అంబానీ, అదానీల ప్రయోజనాలే అత్యంత ముఖ్యమయ్యాయని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవరావు విమర్శించారు.

నూజివీడు టౌన్, డిసెంబరు16: ప్రధాని నరేంద్రమోడీకి దేశ ప్రజలు, రైతుల ప్రయోజనాల కంటే అంబానీ, అదానీల ప్రయోజనాలే అత్యంత ముఖ్యమయ్యాయని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవరావు విమర్శించారు. బుధవారం చిన్నగాంధీబొమ్మ సెంటర్లో ఏపీ రైతు సంఘం, ఎస్ఎ్ఫఐ నాయకులతో ధర్నా నిర్వహించారు. కేశవరావు మాట్లాడుతూ కిసాన్ ముక్తిమోర్చా పేరుతో 500 మంది రైతు సంఘాల నాయకులు ఢిల్లీలో చేస్తున్న పోరాటాన్ని నీరుగార్చేందుకు అనేక విధాలుగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ స్థానంలో విద్యుత్ మీటర్లు బిగించాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం దీనికి అవసరమైన 25 కోట్ల స్మార్ట్ మీటర్ల తయారీకి రిలయన్స్ సంస్థకు ఆర్డర్ ఇవ్వడంలోనే ఆంతర్యం బోధపడుతోంన్నారు. దీంతో పాటుగా విద్యుత్ డిస్ర్టిబ్యూషన్ మొత్తం కారుచౌకగా ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం తమ విధానాలను మార్చుకోవాలని డిమాండ్ చేశారు. స్వాతంత్రోద్యమంలో దేశ ప్రజలు విదేశీ వస్తువుల బహిష్కరించినట్లు ప్రస్తుతం దేశ ప్రజలు కూడా అంబానీ, అదానీ సంస్థలు తయారు చేస్తున్న ఉత్పత్తులను బహిష్కరించాలని కేశవరావు పిలుపునిచ్చారు.