దసరా డిమాండ్ ఎంత..?
ABN , First Publish Date - 2020-10-14T15:55:19+05:30 IST
దసరా సీజన్ వచ్చేసింది. ఆర్టీసీ కృష్ణారీజియన్ ఈ నెల 15 నుంచి దాదాపు 500 స్పెషల్..

గత ఏడాది 1729 స్పెషల్స్
ఒక్క హైదరాబాద్ రూట్లోనే 873
ఈసారి సగం డిమాండ్ కోల్పోయినట్టే
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): దసరా సీజన్ వచ్చేసింది. ఆర్టీసీ కృష్ణారీజియన్ ఈ నెల 15 నుంచి దాదాపు 500 స్పెషల్ సర్వీసులను నడపాలన్న ఆలోచనలో ఉంది. గత ఏడాది ఈ సీజన్లో రీజియన్కు ఎర్నింగ్స్, ఆక్యుపెన్సీ అన్నీ అనుకూలించాయి. ఈ ఏడాది కొవిడ్ నేపథ్యంలో దసరా డిమాండ్ ఎంత ఉంటుందన్నది సందేహంగానే ఉంది. దీనికి తోడు విజయవాడ నుంచి ప్రధాన రూట్లు అయిన హైదరాబాద్, చెన్నెలకు బస్సులు నడిపే అవకాశం లేదు. గత దసరాకు ఇక్కడ నుంచి మొత్తం 1729 స్పెషల్స్ నడపగా, వాటిలో 873 సర్వీసులను హైదరాబాద్ రూట్లోనే నడిపింది. అత్యధిక డిమాండ్ ఉండే ఈ రూట్లో ఈ ఏడాది అంతర్రాష్ట్ర సమస్యతో బస్సుల సంఖ్యకు భారీగా కోతపడింది.
ఇక చెన్నైకు గత ఏడాది దసరా సీజన్లో ఆర్టీసీ 60 స్పెషల్స్ను, బెంగళూరుకు 12 స్పెషల్స్ను నడిపింది. నాడు హైదరాబాద్ రూట్లో 93 శాతం, చెన్నై రూట్లో 99 శాతం, బెంగళూరుకు 146 శాతం ఆక్యుపెన్సీ నమోదయింది. ఈ ఏడాది బెంగళూరుకు మాత్రమే బస్సులున్నాయి. హైదరాబాద్, చెన్నై లోటును ఈ రూట్ ఎంత వరకు తీర్చగలుగుతుందన్నది సందేహమే. దీనికి తోడు అంతర్రాష్ట వివాదం కారణంగా ఈ ఏడాది కోదాడ, సూర్యాపేటలకు కూడా స్పెషల్స్ నడిచే పరిస్థితి లేదు. రీజియన్పై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక కొవిడ్ కారణంగా విద్యార్థులు, ఉద్యోగులూ ఇళ్లకే పరిమితమైపోయారు. పండగ ప్రయాణాలూ ఉండవు. మరి రెండు వారాల పాటు స్పెషల్స్కు డిమాండ్ ఉంటుందా అనేది ప్రశ్నార్థకమే.