గ్రీన్జోన్లలో సడలింపులివీ!
ABN , First Publish Date - 2020-04-21T09:12:09+05:30 IST
కొవిడ్ -19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ పటిష్టంగా అమలు చేసేందుకు సంఘటన అధిపతులుగా (ఇన్సిడెంట్ కమాండర్స్) సబ్కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లను నియమించినట్టు కలెక్టర్ ఇంతియాజ్ సోమవారం మీడియాకు...

విజయవాడ సిటీ, ఏప్రిల్ 20
కొవిడ్ -19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ పటిష్టంగా అమలు చేసేందుకు సంఘటన అధిపతులుగా (ఇన్సిడెంట్ కమాండర్స్) సబ్కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లను నియమించినట్టు కలెక్టర్ ఇంతియాజ్ సోమవారం మీడియాకు ప్రత్యేక బులెటిన్ ద్వారా తెలిపారు. గ్రీన్జోన్ మండలాలు, మున్సిపాల్టీల్లో లాక్డౌన్ సడలింపు అధికారాలు వారికే ఉంటాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు కరోనా వైరస్ ప్రబలుతున్న మూలంగా లాక్డౌన్ వల్ల ప్రజలు పడే ఇబ్బందులను సడలించేందుకు కొన్ని మార్గదర్శకాలను ఇచ్చిందన్నారు.
పాజిటివ్ కేసులు గుర్తించిన ప్రాంతం నుంచి 3 కి.మీ పరిధి వరకూ రెడ్జోన్గా గుర్తించామన్నారు. దానికి బఫర్జోన్ కూడా కలుపుకుంటే పట్టణప్రాంతాల్లో 5 కి.మీ పరిధి, గ్రామీణ ప్రాంతాల్లో 7.కి.మీ పరిధి గుర్తించామన్నారు. ఈ మేరకు జిల్లాలోని 16 మండలాలు, 10 మున్సిపల్ పట్టణాలు రెడ్జోన్గా గుర్తించినట్టు పేర్కొన్నారు. రెడ్జోన్లకు చెందిన ఇన్సిడెంట్ అధిపతులు మరింత పకడ్బంధీగా లాక్డౌన్ అమలు పరచాలన్నారు. ఏ వ్యక్తినీ బయట నుంచి రానివ్వకూడదని, మండలం నుంచి బయటకు వెళ్లేందుకు అనమతించవద్దని స్పష్టం చేశారు. గ్రీన్జోన్ మండలంలోకి బయట వ్యక్తిని రానివ్వకూడదన్నారు.
రెడ్జోన్లుగా గుర్తించిన మండలాలు
విజయవాడ వెస్టు, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈసు,్టవిజయవాడ నార్త్, విజయవాడ రూరల్, మచిలీపట్నం, నూజివీడు, జగ్గయ్యపేట, నందిగామ, వత్సవాయి, పెనుగంచిప్రోలు, పెనమలూరు, కంకిపాడు, చందర్లపాడు, కైకలూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు నగర పంచాయతీల్లో పాజిటివ్ కేసులు గుర్తించడం వల్ల 7 కి.మీ పరిధిలోపు వచ్చే కైకలూరు, కలిదిండి మండలాలు రెడ్జోన్లోనే ఉంటాయి.
రెడ్జోన్లుగా గుర్తించిన మున్సిపాల్టీలు
విజయవాడ, మచిలీపట్నం, నూజివీడు, జగ్గయ్యపేట, నందిగామ, ఉయ్యూరు,పెడన, కొండపల్లి, తిరువూరు, గుడివాడ, కొన్ని మున్సిపాల్టీలో కేసులు రానప్పటికి ముందు జాగ్రత్త చర్యగా రెడ్జోన్లుగా గుర్తించారు.
37 మండలాల్లో లాక్డౌన్ నిబంధనల సడలింపు
మే 3 వరకూ లాక్డౌన్ నిబంధనలు కఠినతరం చేసినందున ఈ నెల 18 నాటికి గుర్తించిన కేసుల ఆధారంగా పై మండలాలు, మున్సిపాల్టీలను రెడ్జోన్లుగా గుర్తించామని కలెక్టర్ చెప్పారు. మిగిలిన 37 మండలాలు గ్రీన్జోన్ పరిధిలోకి వస్తాయన్నారు.
గ్రీన్జోన్లో సడలింపు ఇచ్చే రంగాల వివరాలు
వైద్య,ఆరోగ్య : గ్రీన్జోన్ పరిధిలో ఆసుపత్రులు, నర్సింగ్హోమ్లు, క్లినిక్లు అన్ని యథావిఽధిగా పని చేస్తాయి. మెడికల్ ల్యాబ్లు, మెడికల్ షాపులు, పశువుల ఆసుపత్రులు, పశువుల మెడికల్ షాపులు అన్ని పనిచేస్తాయి. వైద్యం ఆరోగ్యం, వెటర్నరీకి సంబంధించిన పరిశ్రమలు కూడా తమ ఉద్యోగులతో పని చేయించుకోవచ్చు.
వ్యవసాయం, ఆక్వా పరిశ్రమలు : పంటకోతలు, నూర్పిళ్ళు తదతర పనులన్ని చేసుకోవచ్చు. చేపలు, రొయ్యలు, కోళ్ల పెంపకం, పాలు తదితర వాటికి అవసరమయ్యే కేంద్రాలన్ని గ్రీన్జోన్ ఏరియాల్లో తెరిచే ఉంటాయి. వాటికి దాణా, మందులు షాపుల దుకాణాలు అన్ని పనిచేస్తాయి. ఉపాధిహామీ పనులు కూడా గ్రీన్జోన్ మండలాల్లో యథావిధిగా జరుగుతాయి. ఇందులో నీటిపారుదల, నీటి సంరక్షణ పనులు చేపడతారు.
గ్యాస్, ట్రాన్స్పోర్ట్ : అయిల్ గ్యాస్, పెట్రోల్, డీజీల్, కిరోసిన్, సీఎన్జీ, సీఎన్జీ అమ్మకపు కౌంటర్ల్లు తెరిచే ఉంటాయి. పోస్టాఫీసులు యథావిధిగా పని చేస్తాయి. ఎయిర్పోర్ట్, రైల్వే, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులకు అందుబాటులోకి వస్తాయి. ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులకు ఎటువంటి అడ్డంకులు కల్పించకూడదు.