కృష్ణా జిల్లాలో 24 గంటల్లో 52 కరోనా పాజిటివ్ కేసులు.. కారణమిదే..
ABN , First Publish Date - 2020-04-26T21:23:29+05:30 IST
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గడం లేదు సరికదా రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా...

విజయవాడ: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గడం లేదు సరికదా రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 81 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే.. 81 కేసుల్లో ఒక్క కృష్ణా జిల్లాలోనే 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. కృష్ణా జిల్లాలో కూడా మరీ ముఖ్యంగా విజయవాడలోని కృష్ణలంక ప్రాంతంలో ఎక్కువ కరోనా కేసులు వెలుగుచూసినట్లు తెలిసింది. ఉన్నట్టుండి కేసుల సంఖ్య పెరగడానికి కృష్ణలంకలో పేకాట ఆడిన వ్యక్తే కారణంగా అధికారులు తేల్చారు.
కొత్తగా కృష్ణా జిల్లాలో నమోదైన 52 కేసుల్లో కూడా ఎక్కువగా కృష్ణలంకలోనే నమోదయినట్లు గుర్తించారు. కృష్ణలంక ప్రాంతాన్ని పోలీసులు పూర్తి ఆధీనంలోకి తీసుకున్నారు. 200 మందికి పైగా హోం క్వారంటైన్లో ఉంచారు. పరీక్షలు నిర్వహిస్తున్నారు. విజయవాడ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు 100 దాటడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.