నేర పరిశోధనలో ఆధునిక పరిజ్ఞానం తప్పనిసరి
ABN , First Publish Date - 2020-12-13T06:03:13+05:30 IST
నేర పరిశోధనలో అత్యాధునిక, సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తే నిందితులను త్వరగా పట్టుకోగలుగుతామని ఎస్పీ రవీంద్రనాథ్బాబు సూచించారు.

ఎస్పీ రవీంద్రనాథ్బాబు వెల్లడి
మచిలీపట్నం టౌన్, డిసెంబరు 12 : నేర పరిశోధనలో అత్యాధునిక, సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తే నిందితులను త్వరగా పట్టుకోగలుగుతామని ఎస్పీ రవీంద్రనాథ్బాబు సూచించారు. రేంజ్ డ్యూటీ మీట్లో సైంటిఫిక్ ఎయిడ్స్ ఇన్వెస్టిగేషన్ ఛాంపియన్ షిప్ను జిల్లా పోలీసు శాఖ కైవసం చేసుకున్న సందర్భంగా శనివారం క్యాంపు కార్యాలయంలో ఎస్పీ 18 మందికి పతకాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఏలూరు రేంజ్ డ్యూటీ మీట్లో నేరాల దర్యాప్తు సమయంలో నిర్వహించే ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్, లా అండ్ ఆర్డర్, ఇండియన్ పీనల్ కోడ్, సీఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, స్పెషల్ అండ్ లోకల్ చట్టాలు, హ్యాండ్లింగ్, లిఫ్టింగ్, ప్యాకింగ్, కంప్యూటర్ పరిజ్ఞానంపై అందిపుచ్చుకున్న విషయాలు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, పోలీసు జాగిలాల పనితీరులపై నిర్వహించిన పోటీల్లో జిల్లాకు చెందిన ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, పోలీసులకు ఎస్పీ పతకాలు అందించారు. ఏడుగురికి బంగారు పతకాలు, నలుగురికి వెండి పతకాలు, ఏడుగురికి కాంస్య పతకాలు అందించారు. ఎంపికైన పోలీసులు తిరుపతిలో 2021 జనవరిలో జరగనున్న రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్లో పాల్గొని తమ ప్రతిభను కనబరచాలన్నారు. సీఐ రామచంద్రరావు, ఎస్సైలు సత్యనారాయణ, రామకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ రిజ్వాన్, మరో హెడ్ కానిస్టేబుల్ ప్రసాదరావు, పోలీసులు నాగరాజు, గణేష్, ఆనంద్, మోతి, పవన్లకు ఎస్పీ పతకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ధర్మేంద్ర పాల్గొన్నారు.