ప్రాణాలొడ్డి పనిచేస్తున్నా డీలర్ల బాధలు పట్టవా?
ABN , First Publish Date - 2020-07-19T18:17:55+05:30 IST
కరోనా సమయంలో ప్రాణాలను ఫణంగా పెట్టి పేద, మధ్య తరగతి ప్రజలకు..

వైఎస్విగ్రహానికి వినతిపత్రం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): కరోనా సమయంలో ప్రాణాలను ఫణంగా పెట్టి పేద, మధ్య తరగతి ప్రజలకు నిత్యావసరాలను అందించి ప్రభుత్వానికి పేరు తీసుకొచ్చామని, ఇంత సేవ చేసినా తమకు ఇవ్వాల్సిన కమీషన్ విషయంలో తాత్సారం చేయటం తగదని రేషన్ డీలర్లు నినందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలుసుకోలేని పరిస్థితుల్లో రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమం సంఘం ఇచ్చిన పిలుపు మేరకు శనివారం నగరంలోని పోలీసు కంట్రోల్ రూమ్ ఎదుట ఉన్న వైఎస్ విగ్రహానికి రేషన్ డీలర్లు వినతిపత్రాలు ఇస్తూ వినూత్న రీతిలో ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మండాది వెంకటరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన తర్వాత అదే ప్రాంగణంలో డీలర్లనుద్దేశించి ఆయన మాట్లాడారు. డీలర్లకు ఎలాంటి బీమా లేదని, కరోనా వారియర్స్గా గుర్తించి ఆ అవకాశం కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామన్నారు. డీలర్ల సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు.