రేషన్ దుకాణాల రేషనలైజేషన్
ABN , First Publish Date - 2020-02-08T10:43:56+05:30 IST
సచివాలయాల వారీగా రేషన్ దుకాణాల రేషనలైజేషన్ ప్రక్రియకు పౌరసరఫరాల శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా 2,352

సచివాలయాల వారీగా ప్రక్రియకు శ్రీకారం
ఏప్రిల్ నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీకి చర్యలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): సచివాలయాల వారీగా రేషన్ దుకాణాల రేషనలైజేషన్ ప్రక్రియకు పౌరసరఫరాల శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా 2,352 రేషన్ దుకాణాలు ఉన్నాయి. రానున్న ఏప్రిల్ నెల నుంచి క్వాలిటీ బియ్యం అందించాల్సి ఉంది. ఈ క్రమంలోనే గ్రామ సచివాలయాల పరిధిలో ఏఏ రేషన్ దుకాణాలను తీసుకు రావాలన్న దానిపై మ్యాపింగ్ చేస్తున్నారు. గ్రామాల్లో స్థానికంగా ఉండే రేషన్ దుకాణాలే ఉంటాయి. కాబట్టి గ్రామాల్లో మ్యాపింగ్ చేసే విషయంలో ఎలాంటి ఇబ్బందులూ లేవు. పట్టణాల్లో మాత్రం మ్యాపింగ్లో భారీగా మార్పులు జరగనున్నాయి. శ్రీకాకుళంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన విధానంలో సచివాలయ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో జిల్లాలోనూ అదే విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుంది.
దీని ప్రకారం కొద్ది రోజులుగా సచివాలయాల ప్రాతిపదికన రేషన్ డిపోలను మ్యాపింగ్ చేస్తున్నారు. మరోవైపు నవశకం సర్వే ద్వారా రైస్ కార్డులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే రైస్ కార్డులకు అర్హులను వలంటీర్ల ద్వారా గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 13 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. రైస్ కార్డులకు సంబంధించి భారీగా అనర్హులు ఉన్నట్టు గుర్తించారు. ఇలా గుర్తించిన అనర్హుల జాబితాను ఏఏ కారణాలతో తిరస్కరించారో వాటికి సంబంధించిన శాఖలకు అధికారులు పంపినట్టు తెలుస్తోంది. ఉదాహరణకు ఫోర్ వీలర్ ఉంటే.. ఉందో, లేదో తెలుసుకోవడానికి రవాణాశాఖకు పంపుతారు. రవాణా శాఖ నుంచి వాహనం లేదని క్లియరెన్స్ వస్తే అర్హుల జాబితాలో చేర్చుతారు. లేదంటే .. అనర్హుల జాబితాలో చేరుస్తారు.