ఇక అందుబాటులోకి కరోనా పరీక్షలు
ABN , First Publish Date - 2020-06-01T09:26:15+05:30 IST
స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలనుకునే వారికి విజయవాడ నగరం, బయటి ప్రాంతాల్లో
విజయవాడ, ఆంధ్రజ్యోతి : స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలనుకునే వారికి విజయవాడ నగరం, బయటి ప్రాంతాల్లో ప్రత్యేక టెస్ట్ కలెక్షన్ కియోస్క్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఆదివారం ఆయన వీడియో సందేశం పంపారు. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం, సింగ్నగర్ షాదీఖానా, కొత్తపేట షేక్ రాజా హాస్పిటల్లో టెస్టింగ్ కలెక్షన్ కియోస్క్లు ఉన్నాయన్నారు. మూడు రకాల పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు. మొదట ట్రూనాట్ పరీక్ష నిర్వహించి దానిలో పాజిటివ్ వస్తే కచ్చితత్వం కోసం ఆర్టీసీపీఆర్ పరీక్ష నిర్వహిస్తారన్నారు. మూడోదిగా పీఆర్ టెస్ట్ నిర్వహిస్తారని చెప్పారు. మరో 26 మాక్స్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశామని, ఆధార్ కార్డు వెంట తెస్తే పరీక్ష చేస్తారని వివరించారు.
అక్కడి వైద్య సిబ్బందికి తమ ఆధార్ నెంబర్తో పాటు తాము ఉంటున్న ప్రాంతం, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు, ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. విజయవాడ వెలుపల ఉన్న వారికోసం ప్రతి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోనూ టెస్ట్ కలెక్షన్ కియోస్క్లను ఏర్పాటు చేశామన్నారు. మచిలీపట్నం, నూజివీడు, గుడివాడ, జగ్గయ్యపేట, నందిగామ.. ఇలా ప్రతి ఏరియా హాస్పిటల్కు వెళ్లి పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. ఇలా ఇష్టపడని వారు ఇంటి దగ్గరే చేయించుకోవాలనుకున్నా టోల్ ఫ్రీ నెంబర్ 14410కు ఫోన్ చేస్తే ఏఎన్ఎం, ఆశా వర్కర్లు వచ్చి చేస్తారని తెలిపారు.