మోపిదేవిలో పోటెత్తిన భక్తులు
ABN , First Publish Date - 2020-11-19T06:25:11+05:30 IST
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు.
![మోపిదేవిలో పోటెత్తిన భక్తులు](https://media.andhrajyothy.com/appimg/galleries/2020111912532094/11192020005454n89.jpg)
మోపిదేవి : నాగులచవితి సందర్భంగా మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి తెల్లవారుజామునే స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమే్షబాబు, ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి దంపతులు నాగపుట్ట వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. తెల్లవారుజాము 3 గంటలకు పుట్టలో పాలుపోసి నాగుల చవితి మహోత్సవాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం భక్తులకు ఆలయ ప్రవేశం కల్పించటంతో అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు నాగపుట్టలో పాలుపోసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈవో జి.వి.డిఎన్.లీలాకుమార్ ఆధ్వర్యంలో భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
పెనమలూరు: నాగులచవితిని పురస్కరించుకుని మండలంలో నాగేంద్ర స్వామికి భక్తిశ్రద్ధలతో పూజలు అందించారు. చోడవరంలో వెలసిన శ్రీ లక్ష్మీ నారాయణ సహిత నాగేంద్ర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచి సుమారు 10వేల మంది భక్తులు పాల్గొన్నారు. ఏసీపీ శ్రీనివాసరావు, ఏడీసీపీ లక్ష్మీపతి, సీఐ సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. యనమలకుదురులోని రామలింగేశ్వర స్వామి కొండపై వెలసిన నాగేంద్ర పుట్ట వద్ద భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజలు నిర్వహించారు.