గ్రేటర్ భూమ్..!
ABN , First Publish Date - 2020-07-27T13:08:32+05:30 IST
భూముల విలువ పెంపునకు సంబంధించి జిల్లాలో మదింపు..

ఆంధ్రజ్యోతి, విజయవాడ : భూముల విలువ పెంపునకు సంబంధించి జిల్లాలో మదింపు కార్యక్రమం జరుగుతోంది. రిజిస్ర్టేషన్ శాఖ యుద్ధప్రాతిపదికన కసరత్తు చేస్తోంది. అయితే, ఈసారి విజయవాడ నగరంలో భూముల విలువ అంతగా పెరగకపోవచ్చని సమాచారం. విజయవాడలో ఇప్పటికే మార్కెట్తో సమానంగా రిజిస్ర్టేషన్ విలువలు ఉండటంతో నగరంపై పెద్దగా దృష్టి పెట్టలేదు.
విలీన ప్రతిపాదిత గ్రామాల్లో
విజయవాడ గ్రేటర్ విలీన ప్రతిపాదిత జాబితాలో ఉన్న గ్రామాల్లో మాత్రం భూముల ధరల పెంపునకు జిల్లా రిజిస్ర్టేషన్ శాఖ రంగం సిద్ధం చేస్తోంది. విజయవాడ గ్రేటర్ విలీన ప్రతిపాదిత జాబితాలో ఉన్న కానూరు, తాడిగడప, పోరంకి మొదలు కంకిపాడు, ఉయ్యూరు వరకు భూముల ధరలు 10 నుంచి 15 శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుణదల, మాచవరం, రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లి, కేసరపల్లి, గన్నవరం, వీఎన్పురం, పురుషోత్తపట్నం, కొండపావులూరు, వెదురుపావులూరు, నున్న, సూరంపల్లి, జక్కంపూడి, గొల్లపూడి, మైలవరం వరకు 10 నుంచి 15 శాతం మేర భూముల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. విజయవాడ-గుండుగొలను రోడ్డు ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతాల పరిధిలో కూడా ధరలను పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఆగస్టు 1 నాటికి నూతన భూముల ధరలు అందుబాటులోకి రావాల్సి ఉంది. దీని ప్రకారం ఈ నెలాఖరు నాటికి కొలిక్కి తెచ్చి జేసీ మాధవీలత దృష్టికి తీసుకెళ్తారు. ఈ నెలాఖరున రిజిస్ర్టేషన్ శాఖ అధికారికంగా భూముల ధరలను ప్రకటిస్తుంది.