కొంగుపట్టి వేడుకోలు
ABN , First Publish Date - 2020-08-18T09:49:48+05:30 IST
రాజధాని అమరావతికి ఐదు కోట్ల ప్రజలు అండగా ఉండాలని మహిళలు కొంగుపట్టి వేడుకున్నారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు సోమవారం 244వ రోజుకు చేరాయి
![కొంగుపట్టి వేడుకోలు](https://media.andhrajyothy.com/appimg/galleries/2020081804103133/08182020041918n23.jpg)
244వ రోజు ఆందోళనల్లో అమరావతి మహిళలు
తుళ్లూరు/తాడేపల్లి/తాడికొండ, ఆగస్టు 17 : రాజధాని అమరావతికి ఐదు కోట్ల ప్రజలు అండగా ఉండాలని మహిళలు కొంగుపట్టి వేడుకున్నారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు సోమవారం 244వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తు కోసం అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని అందరూ ముక్తకంఠంతో నినదించాలన్నారు. తుళ్లూరు, పెదపరిమి, వెలగపూడి, రాయపూడి, మందడం రైతు శిబిరాల్లో నిరసనలు, దీక్షలు కొనసాగాయి.
ఎమ్మెల్యే ఆర్కే రాజీనామాకు డిమాండ్
రాష్ర్టాన్ని మూడు ముక్కలు చేయడం తగదని, ఒకే రాష్ట్రం-ఒకే రాజధానిగా ఉండాలని ఉండవల్లి జేఏసీ ఆధ్వర్యంలో రైతులు, రైతు కూలీలు సోమవారం నిరసన తెలిపారు. ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గాదె శ్రీనివాసరావు, రమేష్, బుజ్జి శంకర్రెడ్డి, శ్రీనివాసరావు, తేజ అప్పారావు, వెంకటేష్, అశోక్, దాసరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర భవిష్యత్తు అంధకారమైందని పొన్నెకల్లు, మోతడక గ్రామ రైతులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.