పశుపోషణతోనే అభివృద్ధి
ABN , First Publish Date - 2020-02-24T09:35:48+05:30 IST
రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కేడీసీసీ బ్యాంక్ డైరక్టర్ కొమ్మినేని రవిశంకర్ అన్నారు.
నందిగామ రూరల్, ఫిబ్రవరి 23 : రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కేడీసీసీ బ్యాంక్ డైరక్టర్ కొమ్మినేని రవిశంకర్ అన్నారు. దాములూరు కూడలి సంగమేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా రైతు కమిటీ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఆదివారం ఎడ్ల పూటీ లాగుడు పోటీలను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న సంక్షేమ పథకాలను సద్వి నియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ పశు పోషణ చేపట్టి పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని చెప్పారు. మొదటి రోజు 58 ఆంగుళాలలోపు ఎద్దులకు జరిగిన పోటీల్లో పది జతలు పాల్గొన్నాయి. క్వింటాన్నర బరువు, ఆరు నిమిషాల సమ యం కేటాయించారు. రిఫరీలుగా సాంబిరెడ్డి, నాగిరెడ్డి వ్యవహారించారు. ఈ పోటీలకు సహకరించిన దాతలకు రైతు కమిటీ సభ్యులు గాదెల వెంకట రామారవు, నాదెళ్ల నాని, దేవినేని రామారావు, మేడ కోటేశ్వరరావు, కాసర్ల రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ ఈవో పి. సీతారామయ్య, కమిటీ చైర్మన్ కనగాల వెంకటేశ్వరరావు, గ్రామ కార్యదర్శి జీవన జ్యోతి పోటీలను పర్యవేక్షించారు.