మంత్రి వెల్లంపల్లిపై విరుచుకుపడ్డ జనసేన నేత

ABN , First Publish Date - 2020-12-11T20:03:00+05:30 IST

దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి రాష్ట్రంలోని దేవాలయాలు తనకి అనువుగా మార్చుకున్నారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

మంత్రి వెల్లంపల్లిపై విరుచుకుపడ్డ జనసేన నేత

విజయవాడ: దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి రాష్ట్రంలోని దేవాలయాలు తనకి అనువుగా మార్చుకున్నారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేవాలయాల ఆస్తులను తన బినామీల ద్వారా తన పేరుకి మార్చుకున్నారని ఆరోపించారు. దుర్గగుడిలో మూడు సింహాల మాయం ప్రాథమిక దర్యాప్తు కూడా పూర్తి కాలేదన్నారు. సాక్ష్యాధారాలు ఎన్ని బయటపడుతున్న ముఖ్యమంత్రి ఇంత వరకు స్పందించడం లేదని మండిపడ్డారు. జిల్లా ఇన్‌‌చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆశీస్సులు మంత్రి వెల్లంపల్లికి పుష్కలంగా ఉన్నాయన్నారు. మంత్రి అవినీతితో సంపాదించిన ఆస్తుల విలువ వెయ్యి కోట్లు దాటిపోయిందని వ్యాఖ్యానించారు. రంగనాథ స్వామి ఆలయానికి చెందిన రూ.300 కోట్ల రూపాయల భూమిని, కబ్జా చేయడానికి వెల్లంపల్లి  ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.




మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆయన అనుచరులు దండుపాళ్యం గ్యాంగ్ లాగా తయారయ్యారన్నారు. వన్ టౌన్ వెంకటేశ్వరస్వామి ఆలయం చుట్టు పక్కల ఉన్న దేవాదాయ శాఖకు సంబంధించిన రూ.200 కోట్ల భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. శేషమహల్ కనకవల్లి కాంప్లెక్స్‌లో 40 షాపులను మంత్రి ఆక్రమించారన్నారు. దేవాదాయ శాఖకు సంబంధించి గూడవల్లి, పోరంకి, యనమలకుదురు, ఉంగుటూరు ప్రాంతాల్లో భూములని ఆక్రమించారన్నారు. దేవాదాయ భూములను ప్రైవేటుశాఖకు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. ఆస్తులున్న దేవాలయాలకు మాత్రమే నిధులను కేటాయిస్తున్నారన్నారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి మంత్రి వెల్లంపల్లి చీడపురుగులా తయారయ్యారని పోతిన మహేష్ విరుచుకుపడ్డారు. 

Updated Date - 2020-12-11T20:03:00+05:30 IST