కృష్ణలంక, కార్మికనగర్లో ఇంటర్సెప్ట్
ABN , First Publish Date - 2020-04-26T09:19:10+05:30 IST
రెండు రోజులుగా విజయవాడలో పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తయ్యారు. సాధారణ రోజుల్లో జన..

ఆంధ్రజ్యోతి, విజయవాడ : రెండు రోజులుగా విజయవాడలో పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తయ్యారు. సాధారణ రోజుల్లో జన సామర్థ్యం ఉన్న ప్రాంతాల్లో వినియోగించే ఇంటర్సెప్ట్ వాహనాలను రెడ్జోన్లలో పెట్రోలింగ్ కోసం ఉపయోగించాలని నిర్ణయించారు. మాచవరం పోలీస్స్టేషన్ పరిధిలోని కార్మికనగర్, కృష్ణలంక పోలీస్స్టేషన్ పరిధిలోని కృష్ణలంక ప్రాంతాల్లో ఉపకమిషనర్లు హర్షవర్థన్రాజు, విక్రాంత్పాటిల్ ఈ ఇంటర్సెప్ట్ వాహనాలను ప్రారంభించారు. ఒకపక్క డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టడంతో పాటు పెట్రోలింగ్ను ముమ్మరం చేశారు.
ఐదు ద్విచక్ర వాహనాలు, ఏడు జీపుల్లో రెడ్జోన్గా ప్రకటించిన ప్రాంతం పరిధిలోని వీధుల్లో గస్తీ నిర్వహించారు. రెడోజోన్కు చుట్టుపక్కల ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ అండ్ మేనేజ్మెంట్ ఫోర్స్) సిబ్బందిని నియమించారు. ఈ ప్రాంతంలో నిర్వహించాల్సిన విధుల గురించి ఉపకమిషనర్లు వారికి వివరించారు. వాస్తవానికి ఈ విభాగం ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రంగంలోకి దిగుతుంది. ప్రస్తుతం కరోనాను ఓ విపత్తుగా కేంద్రం ప్రకటించడంతో ఆ విభాగ సిబ్బందిని లాక్డౌన్ విధులకు ఉపయోగించాలని నిర్ణయించారు. విజయవాడ కమిషనరేట్కు మొత్తం 50 మందిని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని కేటాయించారు. వారిని రెడ్జోన్ ప్రాంతాల్లో ముమ్మర గస్తీకి వినియోగిస్తున్నారు.