కృష్ణాలో ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధం
ABN , First Publish Date - 2020-12-25T07:12:21+05:30 IST
జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీకి సర్వం సిద్ధమైంది.
![కృష్ణాలో ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
నేటి నుంచి 3లక్షల మందికి పంపిణీ
ఆంధ్రజ్యోతి, విజయవాడ : జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీకి సర్వం సిద్ధమైంది. శుక్రవారం నుంచి జనవరి ఏడో తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 3,03,092 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందించనున్నారు. వీరిలో 1,67,541 మందికి తొలి దశ ఇళ్ల నిర్మాణాన్ని కూడా ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. ఉదయం నుంచి స్థానిక ప్రజా ప్రతినిధులు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. వచ్చిన పట్టాలను వచ్చినట్టు లబ్ధిదారులకు పంపిణీ చేయించటానికి జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
30,716 మందికి తాత్కాలికంగా నిలుపుదల
జిల్లావ్యాప్తంగా 30,716 మంది లబ్ధిదారులకు పట్టాల పంపిణీని తాత్కాలికంగా నిలిపివేశారు. అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాలకు ఎంపిక చేసిన భూముల వివాదం కోర్టులో ఉండటంతో 25 వేల మంది లబ్ధిదారులకు, స్థలాల సేకరణలో ఎదురైన కోర్టు కేసులను దృష్టిలో ఉంచుకుని మరో ఐదు వేల మందికి పట్టాల పంపిణీని తాత్కాలికంగా నిలిపారు.