లాక్డౌన్తో అంతా ఇంట్లోనే.. అర్ధరాత్రి కుప్పకూలిన ఇంటి శ్లాబు..
ABN , First Publish Date - 2020-06-26T16:54:24+05:30 IST
అర్ధరాత్రి ఇంటి శ్లాబ్ కుప్పకూలడంతో మహిళ దుర్మరణం చెందింది. ముగ్గురికి గాయాలయ్యాయి. బైపాస్ రోడ్డులోని వలివర్తిపాడు ఆంధ్రా బ్యాంకు బ్రాంచ్ ఎదురుగా ఈ సంఘటన జరిగింది.
![లాక్డౌన్తో అంతా ఇంట్లోనే.. అర్ధరాత్రి కుప్పకూలిన ఇంటి శ్లాబు..](https://media.andhrajyothy.com/appimg/galleries/2020062611171296/06262020112348n16.jpg)
కూలిన ఇంటి శ్లాబు
ఇరిగేషన్ ఏఈ భార్య మృతి
తండ్రీకొడుకులకు గాయాలు
గుడివాడ (రాజేంద్రనగర్) : అర్ధరాత్రి ఇంటి శ్లాబ్ కుప్పకూలడంతో మహిళ దుర్మరణం చెందింది. ముగ్గురికి గాయాలయ్యాయి. బైపాస్ రోడ్డులోని వలివర్తిపాడు ఆంధ్రా బ్యాంకు బ్రాంచ్ ఎదురుగా ఈ సంఘటన జరిగింది. బ్యాంకు మేనేజర్కు చెందిన ఇంట్లో ఇరిగేషన్ ఏఈ వెంపటి నాగేశ్వరరావు, లక్ష్మి దంపతులు ఏడాదిగా అద్దెకు ఉంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్న వారి ఇద్దరి కుమారులు చంద్రకిరణ్, సూర్యతేజ కూడా లాక్డౌన్తో ఇంట్లోనే ఉన్నారు.
కుటుంబ సభ్యులు నిద్రస్తున్న సమయంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత (గురువారం వేకువజామున) 2.15 గంటల సమయంలో అద్దె ఇంటి శ్లాబు ఒక్కసారిగా కుప్పకూలింది. పెచ్చులు పడటంతో ఏఈ సతీమణి లక్ష్మి స్పృహకోల్పోయింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. నాగేశ్వరరావు, చంద్రకిరణ్, సూర్యతేజలకు గాయాలయ్యాయి. చంద్రకిరణ్ ఫిర్యాదు మేరకు ఎస్సై టి.సూర్యశ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇల్లు పైకి బాగానే ఉన్నా హఠాత్తుగా శ్లాబు కూలడం ఆశ్చర్యకరం.