ఏం చేస్తారో..? ఎయిర్‌పోర్టు రైతుల సమస్యలపై స్పందించిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-08-20T14:21:26+05:30 IST

రాజధానితో ముడిపడి ఉన్న అంశం. తరలిస్తే రైతులకు న్యాయం జరగదు..

ఏం చేస్తారో..? ఎయిర్‌పోర్టు రైతుల సమస్యలపై స్పందించిన ప్రభుత్వం

జిల్లా యంత్రాంగం, ఎయిర్‌పోర్టు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

మౌలిక సదుపాయాలు, రైతు సమస్యలపై చర్చ

నేడు రిపోర్టు ఇవ్వాలన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్

సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ


ఆంధ్రజ్యోతి, విజయవాడ: రాజధానితో ముడిపడి ఉన్న అంశం. తరలిస్తే రైతులకు న్యాయం జరగదు. తరలించకపోతే ప్రభుత్వ పంతం నెగ్గదు. విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు రావడంతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చింది. విజయవాడ విమానాశ్రయ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ చర్చించారు. జిల్లా యంత్రాంగం, ఎయిర్‌పోర్టు అధికారులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. గురువారం పది గంటలలోపు విమానాశ్రయ అభివృద్ధి, రైతుల సమస్యలకు సంబంధించిన సమగ్ర నివేదికను సమర్పించాలని, ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. 


చర్చలోకి వచ్చిన అంశాలు

విమానాశ్రయ అభివృద్ధికి 1,200 ఎకరాలకు పైగా ఇచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన అంశాలపై కరికాల వలవన్‌ అధికారులను కోరారు. రాజధాని అమరావతిలో ఇస్తామన్న ప్యాకేజీపై కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, ఎయిర్‌పోర్టు సమస్యలను డైరెక్టర్‌ జి.మధుసూదనరావు వివరించారు. రన్‌వే కోసం ప్రహరీని నిర్మించాలని, దావాజీగూడెంలో రన్‌వేకు సమీపంలో ఉన్న ఇళ్లను ఖాళీ చేయించాలన్నారు. వీరికి సంబంధించి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, రెంటల్‌ పేమెంట్స్‌ విషయంలో చర్యలు తీసుకోకపోవటం వల్ల సమస్యగా ఉందని చెప్పారు. 


రైతుల సమస్యలపై ఎమ్మెల్యే వంశీ వివరణ

గన్నవరం  రైతుల సమస్యలపై ఎమ్మెల్యే వంశీమోహన్‌ వివరించారు. రైతులు అమరావతి ప్యాకేజీకి అంగీకరించి భూములు ఇచ్చారని, వారికి అన్ని విధాలా న్యాయం చేయాల్సి ఉందన్నారు. 


నివేదిక సిద్ధం చేయాలని ఆదేశాలు 

ఎయిర్‌పోర్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, రైతుల సమస్యలపై సమగ్ర నివేదికను గురువారం 10 గంటల్లోగా అందించాలని కరికాల వలవన్‌ అధికారులను ఆదేశించారు.  వాటన్నింటినీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. అయితే, అమరావతితో ముడిపడి ఉన్న అంశం కావటంతో ఏం జరుగుతుందో వేచిచూడాలి.


‘ఆంధ్రజ్యోతి’ కథనాలకు స్పందన

విమానాశ్రయ రన్‌వేను మరికొద్దిరోజుల్లో అందుబాటులోకి తీసుకురావాల్సి ఉండగా ఎదురవుతున్న సమస్యలపై, ఆ తర్వాత సమస్య పరిష్కారానికి రైతులకు చెల్లించాల్సిన రూ.108 కోట్ల చెల్లింపులపై, ఎయిర్‌పోర్టు అభివృద్ధికి ఇచ్చిన భూముల్లో రైతులు సాగు చేపట్టిన వివరాలపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించింది. దీంతో ప్రభుత్వం ఈ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. 


Updated Date - 2020-08-20T14:21:26+05:30 IST