సంక్రాంతికి రెగ్యులర్ రైళ్లు లేవు..!
ABN , First Publish Date - 2020-12-31T05:14:25+05:30 IST
సంక్రాంతికి రెగ్యులర్ రైళ్లు లేవు..!
విజయవాడ, ఆంధ్రజ్యోతి : ఈ సంక్రాంతికి కూడా రెగ్యులర్ రైళ్లు తిరగని పరిస్థితి ఏర్పడింది. ఇక పండుగ ప్రత్యేక రైళ్లలో రెండు రెట్లు అదనంగా చెల్లించి ప్రయాణించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అన్లాక్ తర్వాత రైళ్లకు డిమాండ్ పెరిగింది. అయితే, రెగ్యులర్ రైళ్లకు లాక్ తీయకపోవటం వల్ల పేద, మధ్య తరగతి వర్గాలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నాయి. ప్రత్యేక రైళ్లలో జనరల్ బోగీలు లేకపోవటం, రాయితీలు వర్తించకపోవటంతో సామాన్యుడి ప్రయాణం దుర్లభంగా మారింది. దీనికితోడు సాధారణ రైళ్లలో కంటే అదనంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. రిజర్వేషన్ ప్రక్రియను కూడా ఆన్లైన్ చేయటంతో చదువు లేనివారు అవస్థలు పడుతున్నారు. పాసింజర్ రైళ్లలో వెళ్దామనుకుంటే డిమాండ్ ఉన్న పాసింజర్లను ఎక్స్ప్రెస్లుగా మార్చారు. పోనీ ప్రత్యేక రైళ్లు మరిన్ని నడుపుతారనుకుంటే అదీ లేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఇటీవల రైళ్ల సమయాలను పూర్తిగా మార్చేయడం ప్రయాణికులను గందరగోళ పరుస్తోంది. ఈ పరిస్థితుల నడుమ సంక్రాంతి ప్రయాణాలు పెద్ద ఎత్తున జరగనున్నాయని తెలిసి కూడా రైల్వేశాఖ రెగ్యులర్ రైళ్లను నడపకూడదని నిర్ణయించడం విమర్శలకు తావిస్తోంది.