ప్రభుత్వ రీ-ఇంజనీరింగ్ నాటకాలు
ABN , First Publish Date - 2020-12-10T06:07:35+05:30 IST
ప్రభుత్వ రీ-ఇంజనీరింగ్ నాటకాలు

దేవినేని ఉమా ధ్వజం
పాయకాపురం, డిసెంబరు 9 : రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోకుండా, సాగునీటి రంగాన్ని సర్వనాశనం చేసిన జగన్ ప్రభుత్వం, ఇప్పుడు రీ-ఇంజనీరింగ్ పేరుతో ప్రాజెక్టుల పేర్లను మారుస్తోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముక్త్యాల ఎత్తిపోతల పథకాన్ని యాదాద్రికి ఎందుకు మార్చారని, దాని పేరును వైఎస్సార్ ఎత్తిపోతల పథకం అని ఎందుకు మార్చారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో మొదలైన పథకాన్ని వైఎస్సార్ ముక్త్యాల పథకమని మార్చడం, ఆయన ఆలోచనల నుంచే పుట్టిందని చెప్పుకోవడం సరికాదన్నారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ రివర్స్ టెండరింగ్ డ్రామాలు చూశామని, ఇప్పుడు రీ-ఇంజనీరింగ్ నాటకాలు చూస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే, జీడిపల్లి-పేరూరు ఎత్తిపోతల పథకానికి మళ్లీ పరిటాల రవీంద్ర పేరు పెట్టి తీరుతామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటి రంగానికి రూ.1,000 కోట్లు కూడా ఖర్చు చేయలేదని, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని చెప్పారు. గండికోట, పోలవరం నిర్వాసితులను గాలికొదిలేశారని చెప్పారు. ప్రభుత్వ అడ్డగోలు, అవినీతి నిర్ణయాల్లో భాగస్వాములు కావొద్దని అధికారులకు దేవినేని ఉమా సూచించారు.