రిజర్వేషన్ల పరిరక్షణకు ఉద్యమించండి
ABN , First Publish Date - 2020-03-02T09:56:03+05:30 IST
రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకునేందుకు దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, ఉద్యోగులు ఉద్యమించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జల్లి విల్సన్ పిలుపునిచ్చారు.

గవర్నర్పేట, మార్చి 1: రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకునేందుకు దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, ఉద్యోగులు ఉద్యమించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జల్లి విల్సన్ పిలుపునిచ్చారు. హనుమాన్పేటలోని దాసరి భవన్లో ఆదివారం దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి సమితి రాష్ట్ర అధ్యక్షుడు జేపీ ప్రభాకర్ అధ్యక్షత వహించారు. ప్రమోషన్లలో రిజర్వేషన్లు కచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదని ఇటీవల కోర్టు చెప్పడాన్ని జల్లి విల్సన్ వ్యతిరేకించారు. ప్రమోషన్లలో రిజర్వేషన్లు లేకపోతే వాటికి అర్థమే లేకుండా పోతుందన్నారు. మొత్తం రిజర్వేషన్లకే ప్రమాదం ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల వద్ద అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుంటూ వారి ఉపాధిని దెబ్బతీస్తోందన్నారు.
దళితులకు నష్టం కలిగించే చర్యలపై ఉద్యమిస్తామన్నారు. సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు మాట్లాడుతూ దళితులకు ఒకచేత్తో ఇళ్ల స్థలాలు ఇచ్చి మరోచేత్తో సాగుచేస్తున్న అసైన్డ్ భూములను లాక్కోవడం అన్యాయమన్నారు. ఎస్సీ, ఎస్టీ నిధులను దారి మళ్లించి అమ్మ ఒడి వంటి పథకాలకు ఉపయోగించడం సరికాదన్నారు. సమావేశంలో ఢిల్లీ అల్లర్లలో, రిజర్వేషన్ల పరిరక్షణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు. సమావేశంలో సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బుట్టి రాయప్ప, రాష్ట్ర నాయకులు ఆర్.గురుదాస్, జి.మాధవస్వామి, సుబ్బలక్ష్మి, ఎస్.నాగరాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.