ఏలూరు బాధితులకు వైద్యంతో పాటు రూ.50వేలు ఇవ్వాలి
ABN , First Publish Date - 2020-12-10T06:08:45+05:30 IST
ఏలూరు బాధితులకు వైద్యంతో పాటు రూ.50వేలు ఇవ్వాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
విజయవాడ సిటీ : ఏలూరులో వింత వ్యాధితో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు రూ.50వేల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నగరంలోని దాసరి భవన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏలూరులో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. వీటిపై సీనియర్ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో కమిటీ వేసి సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. కేంద్రప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన భారత్ బంద్ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను నిలిపివేయాలని ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లడం సరైనది కాదన్నారు. కరోనా పేరుతో ఎన్నికలు నిర్వహించలేమని చెప్పడం దారుణమన్నారు. ఇటీవల బిహార్ అసెంబ్లీ, తెలంగాణాలో జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరిగాయని గుర్తు చేశారు. కరోనా అంత తీవ్రంగా ఉంటే జగన్ పాదయాత్రకు మూడేళ్లు పేరుతో వైసీపీ శ్రేణులు ర్యాలీలు నిర్వహించిన విషయాన్ని ఆయన పేర్కొన్నారు. టిడ్కో గృహ సముదాయాల్లో ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలను కల్పించి అందించే వరకు పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వెంకయ్య, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ పాల్గొన్నారు.