మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ రామకృష్ణ

ABN , First Publish Date - 2020-10-07T18:42:44+05:30 IST

మోదీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ రామకృష్ణ

అమరావతి: మోదీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రెండోసారి మోదీ అధికారంలోకి వచ్చాక మొదటిసారి కంటే వేగంగా తమ అజెండా అమలు చేస్తున్నారని అన్నారు. పేరుకి ఎన్డీయే ప్రభుత్వం కానీ ఫక్తు ఆర్ యస్ ఎస్ అజెండాను అమలు చేస్తున్నారని విమర్శించారు. తమకు ఎవరి మద్దతు అవసరం లేదంటూ... ఏది అనుకుంటే అది అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్‌లలో ప్రజా హక్కులను కాలరాస్తూ ఇష్టం వచ్చినట్లు నిర్బంధాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ఇబ్బందుల్లో ఉన్నారని..బ్యాంకుల్లో అప్పులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. ఇలాంటి సమయంలో కూడా అంబానీ ఆదానిల ఆస్తుల విలువ పెరుగుతుందని అన్నారు. వాళ్లకు ఊడిగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్లకు అప్పగుస్తున్నారని.. బిల్లులపై ఓటింగ్ కూడా పెట్టకుండా ఆమోదించారని దుయ్యబట్టారు. 


నిర్మల సీతారామన్ కూడా కేంద్రం చేస్తున్న అన్ని పాపాల్లో భాగస్వామి అని అన్నారు. నిర్మలా సీతారామన్ రాకను నిరసిస్తూ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా మధ్యాహ్నం నిరసన తెలుపుతున్న రైతు సంఘాలకు సీపీఐ మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. ప్రధానితో భేటీపై ఏం మాట్లాడారో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. తమ వ్యక్తిగత విషయాలు చెప్పాల్సిన అవసరం లేదని..రాష్ట్ర వ్యవహారాలపై ఏం చెప్పారో ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఏమిస్తానని చెప్పారని నిలదీశారు. విభజన హామీలు అమలు చేస్తామని చెప్పారా? అని రామకృష్ణ ప్రశ్నించారు. ‘‘ప్రత్యేక హోదా అంశంపై నీ మెడ వంగుతుంది తప్ప మోదీ మెడలు వంచింది లేదు. హోదా తెచ్చింది లేదు. ఏం మాట్లాడారు ఇంత డార్క్ లో పెట్టాల్సిన అవసరం ఏంటి. మీడియా ముందుకు ముఖ్యమంత్రి వచ్చి ప్రధాని భేటి అంశాలు చెప్పాలి’’ అంటూ డిమాండ్ చేశారు. 


కోట్ల కుటుంబంపై గెలిచిన గుమ్మనురు జయరాంపై అయ్యన్న చేస్తున్న ఆరోపణలపై నిజాలు నిగ్గు తేల్చాలని పట్టుబట్టారు. రైతుల వద్ద కొన్న భూములు వెనక్కి ఇచ్చేయాలని...రైతులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. అయ్యన్నకు...తమకు మధ్య సవాళ్లు పక్కన పెట్టి పేద రైతుల వద్ద కొన్న భుములు వెనక్కి ఇచ్చేయాలని హితవు పలికారు. సీపీఐ, సీపీఎం పార్టీలు దీనిపై విచారించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. అవినీతి అరికడతామని నెంబర్ ఇవ్వడం కాదని..టీవీల్లో వచ్చే వాటిపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. మంత్రి జయరాం తప్పు చేస్తున్నారని..పేద రైతుల వద్ద భూములు తీసుకోవడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కలగజేసుకుని రైతులకు భూములు వెనక్కి ఇవ్వాలని లేదా అవినీతి నిరోధిస్తాం అనే మాటలు మాట్లాడవద్దని సూచించారు. ముఖ్యమంత్రికి ఉత్తరం కూడా రాశామని.. దీనిపై తక్షణమే స్పందించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-10-07T18:42:44+05:30 IST