చాపకింద నీరులా వైరస్
ABN , First Publish Date - 2020-11-26T06:17:55+05:30 IST
జిల్లాలో కరోనా తగ్గుముఖం పట్టిందని వైద్యాధికారులు ప్రకటించినప్పటికీ వైరస్ వ్యాప్తి చాపకింద నీరులా కొనసాగతూనే ఉంది.

జిల్లాలోనే కేసులు అధికం
కొత్తగా 145 మందికి కరోనా
మరో ఇద్దరు బాధితులు మృతి
(ఆంధ్రజ్యోతి-విజయవాడ)
జిల్లాలో కరోనా తగ్గుముఖం పట్టిందని వైద్యాధికారులు ప్రకటించినప్పటికీ వైరస్ వ్యాప్తి చాపకింద నీరులా కొనసాగతూనే ఉంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే కృష్ణాజిల్లాలోనే పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. బుధవారం జిల్లాలో 145 మందికి వైరస్ సోకగా, ఇద్దరు బలైపోయారు. జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44,890కి చేరుకోగా, మరణాలు అధికారికంగా 628కి పెరిగాయి. చికిత్స పొందుతున్న బాధితుల్లో 199 మంది కోలుకుని ఇళ్లకు చేరుకోగా.. ఇంకా 1,649 మంది ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. దేశ రాజధానిలో ప్రారంభమైన సెకండ్ వేవ్ క్రమంగా అన్ని రాష్ట్రాలకూ వ్యాప్తి చెందే అవకాశముందని, చలికాలంలో వైరస్ మరింత విజృంభించే ప్రమాదమున్నందున ప్రజలందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.