కేఎల్రావు నగర్లో కరోనా వ్యాప్తికి వైసీపీ ప్రచార ఆర్భాటమే కారణం!
ABN , First Publish Date - 2020-05-24T07:54:54+05:30 IST
కె.ఎల్.రావునగర్లో కరోనా వ్యాప్తికి వైఎస్సార్సీపీ ప్రచార ఆర్భాటమే కారణమని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ..

చిట్టినగర్, మే 23: కె.ఎల్.రావునగర్లో కరోనా వ్యాప్తికి వైఎస్సార్సీపీ ప్రచార ఆర్భాటమే కారణమని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జీ పోతిన వెంకట మహేష్ దుయ్యబట్టారు. శనివారం దీనదయాల్ నగర్ పట్నాయక్ టవర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్టకరణాల కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 50 రోజులుగా ప్రశాంతగా ఉన్న కేఎల్.రావునగర్లో ఒక్కసారిగా కరోనా హాట్స్పాట్ జోన్గా మారటానికి కారణం వైసీపీ ప్రచార ఆర్బాటమేనన్నారు. గడపదాటని మాతృమూర్తికి కరోనా సోకి మరణించడానికి ప్రధాన కారణం ఇదేనన్నారు. భౌతికాయం వద్దకు 20 మందికి అనుమతి ఉంటే 300 మంది వచ్చినా పోలీసులు ఎందుకు కేసులు నమోదు చేయలేదన్నారు.
పోలీసులు విచారణ చేసి వెంటనే కేసు నమోదు చేయాలని, లేకుంటే గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే చట్టపరంగా ముందుకు సాగుతామన్నారు. మంత్రి వెల్లంపల్లి, వైసీపీ నేతలు వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, 28 రోజులపాటు హోమ్ క్వారంటైన్లో ఉండాలన్నారు. లేకపోతే పెద్దఎత్తున ప్రజలకు కరోనా సోకి ప్రాణ నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ ప్రాంతంలో 250 మందికి పరీక్షలు చేయాలని కలెక్టర్ను కోరగా సానుకూలంగా స్పందించారన్నారు. స్థానిక జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్ధి మైనర్బాబు మాట్లాడుతూ కరోనా జాగ్రత్తలు పాటించాలని బ్యానర్లతో ప్రచార ఆర్బాటాలు చేయటం కాదు. ఆచరణలో చేసి చూపాలన్నారు. సమాజం పట్ల బాధ్యత తో మెలగాలని అప్పుడే ప్రజలు హర్షిస్తారన్నారు. ఈ సమావేశంలో స్ధానిక పార్టీ నాయకులు గౌరీశంకర్ పాల్గొన్నారు.