అంగుళం కదిలించినా అంగీకరించం
ABN , First Publish Date - 2020-06-11T09:01:08+05:30 IST
అమరా వతి నుంచి రాజధానిని అంగుళం కదిలించినా అంగీకరించేది లేదని 29 గ్రామాల రైతులు, కూలీలు, మహిళలు తేల్చి చెప్పారు.

176వ రోజు ఆందోళనలో రాజధాని రైతులు
గుంటూరు(ఆంధ్రజ్యోతి), తాడికొండ, జూన్ 10: అమరా వతి నుంచి రాజధానిని అంగుళం కదిలించినా అంగీకరించేది లేదని 29 గ్రామాల రైతులు, కూలీలు, మహిళలు తేల్చి చెప్పారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తోన్న ఆందోళనలు బుధవారానికి 176వ రోజుకు చేరాయి. ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ పోరు ఆగదని స్పష్టం చేశారు. కళ్లున్న గుడ్డివానిగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటింటా అమరావతి కింద ఆందోళనలు నిర్వహించిన మహిళలు మాట్లాడుతూ కోర్టుల్లో వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయని, అమరావతి విషయంలోనూ అదే పునరావృతం అవుతుందన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం కింద ఇళ్లల్లో దీపాలు, కొవ్వొత్తులు వెలిగించి నిరసనలు తెలిపారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలంటూ తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో 49వ రోజు ఆందోళనలు కొనసాగించారు.