విజయవాడలో రైతులతో జీవీఎల్ భేటీ

ABN , First Publish Date - 2020-12-25T18:32:53+05:30 IST

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రైతులతో ఆ పార్టీ జీవీఎల్ శుక్రవారం సమావేశం అయ్యారు.

విజయవాడలో రైతులతో జీవీఎల్ భేటీ

విజయవాడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రైతులతో ఆ పార్టీ జీవీఎల్ శుక్రవారం సమావేశం అయ్యారు. మూడు వ్యవసాయ బిల్లులపై కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలను ఈ సందర్భంగా రైతులకు జీవీఎల్ వివరించారు. ముందుగా మాజీ ప్రధాని వాజపేయి జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు‌ వేసి నివాళులు అర్పించారు. అనంతరం జీవీఎల మాట్లాడుతూ... అనేక పదవులు అలంకరించినా  ఒకేరకమైన వ్యక్తిత్వంతో వాజపేయి ఉన్నారన్నారు. సాధారణ కుటుంబంలో జన్మించి.. ప్రధానిగా ఎదిగారని తెలిపారు. ఇప్పుడు మోదీ కూడా అదే బాటలో పాలన సాగిస్తున్నారని ఆయన  చెప్పారు. వాజపేయి పని తీరు, పాలన.. నేటి తరాలకు స్పూర్తిదాయకమన్నారు. వ్యవసాయ సంస్కరణలను మూడు చట్టాల రూపంలో తెచ్చామని... వీటిపై దేశ వ్యాప్తంగా అనేక అలోహలు ఉన్నాయన్నారు. రైతుకు మేలు చేయాలనే మోదీ ఈ కొత్త చట్టాలను తెచ్చారన్నారు.


యూరియా ఇబ్బంది లేదంటే అది బీజేపీ ప్రభుత్వం కృషి వల్లే అని అన్నారు. వ్యవసాయ రంగానికి ఆరు రెట్లు బడ్జెట్‌లో కేటాయింపులు పెంచామని వెల్లడించారు. యాభై లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో నీటిపారుదల అందేలా చేశామన్నారు. దేశంలో ఉన్న వెయ్యి మార్కెట్‌లలో ధరలు తెలుసుకుని రైతులు అమ్ముకునేలా  ఈనామ్  తెచ్చామని జీవీఎల్ తెలిపారు. పంట భీమ యోజన కింద ప్రీమియం కూడా తగ్గించి 6.6 కోట్ల మంది రైతుల పంటలను ఇన్సూరెన్స్ చేయించామన్నారు. కాంగ్రెస్ హయాంలో వరి, గోధుమ తప్ప ఏదీ కొనుగోలు చేయలేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం రెండున్నర రెట్లు వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసిందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసేలా మోదీ  నూతన విధానాలను అమలు చేశారన్నారు. స్వామినాధన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం ముఖ్య పంటలకు ధర రావాలని సిఫార్సు చేశారని చెప్పారు. 2005-06లో ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రిపోర్ట్‌ను పక్కన పడేసిందని మండిపడ్డారు. 2018లో మోదీ ప్రభుత్వం ఖర్చు కంటే యాభై శాతం లాభం చేకూర్చేలా చేసిందన్నారు.


ఈరోజు కాంగ్రెస్ పార్టీ తమను విమర్శిస్తుందని...రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రజల్లో అపోహలు కలిగించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు చేసిన మూడు వ్యవసాయ చట్టాలలోని అంశాలు..  స్వామినాధన్ కమిషన్ చెప్పినవే అని అన్నారు. ఎమ్‌ఎస్పీ ధరపై విపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయన్నారు. ఇతర పార్టీలు చేస్తున్న తప్పులను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. తమ విధానాలను, సంస్కరణలను ప్రజలకు, రైతులకు వివరిస్తామని జీవీఎల్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-25T18:32:53+05:30 IST